పార్లమెంట్​లో నోరెత్తని టీఆర్​ఎస్​ ఎంపీలు.. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి

by  |
Revanth-reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వేర్వేరు కాదని, అవసరం అయినప్పుడల్లా బీజేపీకి టీఆర్ఎస్ అండగా ఉంటుందని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ వ్యతిరేక శక్తుల సమీకరణ కోసం మంగళవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం రేవంత్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తోందని రేవంత్ ఆరోపించారు.

ఏపీ దాదాగిరి చేస్తుందని కేసీఆర్ అన్నారని, కానీ ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏనాడూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదని ధ్వజమెత్తారు. మోడీ, కేసీఆర్ వేర్వేరు కాదని, పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తుంటే టీఆర్ఎస్ ఎంపీలు కలిసి రాలేదని రేవంత్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన సమావేశానికి టీఆర్ఎస్ రాకుండా నరేంద్ర మోడీకి స్పష్టమైన మద్దతును కేసీఆర్ ప్రకటించారని, బీజేపీ ఫ్రంట్ ఆర్గనైజేషన్‌గా టీఆర్ఎస్ పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మోడీకి లొంగిపోయారని, అందుకే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు.

ఇక గవర్నర్​ కోటాలో కౌశిక్​రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఎందుకు ఇచ్చారని, కోవర్టు అయినందుకే ఆ పదవి దక్కిందన్నారు. గవర్నర్​ కోటాలో 64 కళల్లో నిష్ణాతులకు ఎమ్మెల్సీ ఇస్తారని, కానీ కోవర్టు అనే 65 కళలో నిష్ణాతులు కావడంతో కౌశిక్​రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టాడని రేవంత్​రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పార్టీ నేతలందరినీ కలుపుకుని వెళ్లి ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేస్తామనని వెల్లడించారు.

ఎంపీ సంతోష్​ ఎందుకు భేటీ అయ్యారు

పార్లమెంట్​ సమావేశాల సందర్భంగా టీఆర్​ఎస్​ ఎంపీ జోగినపల్లి సంతోష్​ ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలతో కలిసి ప్రధానిని కలిశారని, కొంత సమయం తర్వాత ప్రధానితో ఎంపీ సంతోష్​ ఎందుకు ఏకాంతంగా సమావేశం అయ్యారో కేసీఆర్​ సమాధానం చెప్పాలని రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. ప్రధానితో ఎంపీ సంతోష్​ జరిపిన సమావేశం గురించి సీఎం కేసీఆర్​ తెలుసా అని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఇద్దరూ చర్చిస్తే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నారు. రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఎక్కడ జరిగిందని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్​ చేసిన ఆర్థిక కుంభకోణాల నుంచి తప్పించుకునేందుకే మోడీకి గులాంగిరి చేస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్​ అవినీతి చిట్టా మొత్తం మోడీ దగ్గర ఉందని, అందుకే మోడీ కాళ్ల మీద పడ్డారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీతో దిగిన ఫొటోలు ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. కృష్ణా, గోదావరి జలాలు, పెండింగ్ నిధులు, కేంద్రం గెజిట్ తోపాటు ఏ అంశాలనూ టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్​ అవలంబిస్తున్న మోడీ అనుకూల విధానాలతో తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు.

కాగా రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఒత్తిడితోనే బండి సంజయ్ పాదయాత్రను రద్దు చేకున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రధానితో మాట్లాడి బండి సంజయ్​ పాదయాత్రను ఆపించారని విమర్శించారు.



Next Story

Most Viewed