ప్రొఫెసర్ సాయిబాబా తొలగింపుపై టీఆర్ఎస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by  |
K.Keshava Rao Professor Saibaba
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రొఫెసర్ సాయిబాబాను అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కేశవరావు అన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటూ నాగపూర్ జైల్లో ఉన్న సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఖండించారు. కేసు విచారణలో ఉండగానే సర్వీసుల నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. గతంలో కోర్టు కేసుల్లో నిర్దోషులుగా బయటపడి తమ ఉద్యోగాల్లో యథావిధిగా చేరిన ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారని తెలిపారు.

సాయిబాబా అంగ వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో జైలు నుంచి విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రికి గతంలోనే లేఖ రాసినట్లు పేర్కొన్నారు. 90 శాతం అంగ వైకల్యంతో బాధపడుతున్న సాయిబాబాను జైల్లోనే ఉంచడం ఏమాత్రం సమంజసం కాదని, ఆయన్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాయిబాబాను ఉద్యోగం తొలగింపుపై తన నిర్ణయాన్ని రాంలాల్ ఆనంద్ కాలేజీ పునఃసమీక్షించుకోవాలని కోరారు.



Next Story

Most Viewed