బీజేపీ నేతలవి కుళ్లు రాజకీయాలు

by  |
బీజేపీ నేతలవి కుళ్లు రాజకీయాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ నేతలు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనాపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఆదివారం అసెంబ్లీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జేపీ నడ్డాకు కరోనా కేసుల లెక్క తెలియకపోవడం హస్యాస్పదమని విమర్శించారు. కరోనా మరణాలు జాతీయ స్థాయిలో 3.26, తెలంగాణలో 2.26శాతం ఉన్న సమయంలో అంతర్జాతీయ రవాణా సౌకర్యాలను ఎందుకు నిలిపివేయలేదన్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు మర్కజ్ వ్యవహారం బయటపెట్టే వరకు కేంద్రం మొద్దు నిద్ర పోయిందన్నారు. కేంద్ర ఆధీనంలో ఉన్న ఐసీఎంఆర్ ఓ మాట చెబితే.. ఆయుష్ మరో మాట చెబుతుందన్నారు. జేపీ నడ్డా, బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎవరు నమ్మరన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ దేశమంతా అంతా కరోనాతో ఇబ్బంది పడుతుంటే బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలకు మైండ్ దొబ్బినట్టుందని ఎద్దేవా చేశారు. దేశ సరిహద్దుల్లో చైనా, దేశంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరులో మార్పులేదన్నారు. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ దేశానికి పనికి రాదని టీఆర్ఎస్ పార్టీ చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.


Next Story

Most Viewed