‘ఎమ్మెల్యేగారు బదులిస్తారా’.. అంతలోనే టీఆర్ఎస్ నేతల అటాక్

by  |
‘ఎమ్మెల్యేగారు బదులిస్తారా’.. అంతలోనే టీఆర్ఎస్ నేతల అటాక్
X

దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‎నగర్‎లో ఓ ప్రయివేట్ న్యూస్ చానల్ ఏర్పాటు చేసిన డిబేట్ రసాభసగా మారింది. కార్యక్రమం ప్రారంభమవుతున్న సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది అక్కడకు చేరుకుని డిబేట్‌ను అడ్డుకున్నారు. కొద్దిసేపు వేదికపై నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. సదరు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థకు సంబంధించిన లైవ్ టెలికాస్టింగ్ పరికరాలు, వాహనాన్ని ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

‘ఎమ్మెల్యేగారు బదులిస్తారా..!’ పేరుతో లైవ్…

హుజూర్‎నగర్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ‘ఎమ్మెల్యే గారు బదులిస్తారా’ పేరుతో.. పట్టణంలోని శ్రీలక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఓ న్యూస్ చానల్ నిర్వాహకులు లైవ్ డిబేట్ ఏర్పాటు చేశారు. అందుకోసం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే, అధికార, ప్రతిపక్ష నాయకులను చర్చలో పాల్గొనడానికి ఆహ్వానించారు. కాగా ఆదివారం ఉదయం చర్చలో పాల్గొనడానికి వివిధ పార్టీల నాయకులు అక్కడకు చేరుకున్నారు. అయితే లైవ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా నినాదాలు చేస్తూ కొంతమంది వేదిక పైకి వచ్చి ప్రోగ్రామ్‌ను అడ్డుకున్నారు. కావాలనే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రోగ్రామ్ చేస్తున్నారని నినాదాలు చేస్తూ అక్కడ ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేసి చిలుకూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మీడియా స్వేచ్ఛకు గొడ్డలి‌పెట్టు

ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, ఐన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డిలు మండిపడ్డారు. మీడియాపై దాడిని అందరు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు ర్యాలీగా వెళ్లి మీడియాపై దాడికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధిపై జరగుతున్న చర్చలో పాల్గొనకుండా దాడులు చేయడం అమానుషం అన్నారు. లైవ్ డిబేట్‌కు రాకుండా ఓయూ జేఏసీ నాయకులు భాస్కర్ నాయక్‌ను అడ్డుకోవడం అమానుషం అన్నారు. జరిగిన అక్రమాలపై చర్చ జరుగుతుందనే డిబేట్‌ను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్, కోతి సంపత్ రెడ్డి, తన్నీరు మల్లిఖార్జున్, జక్కుల మల్లయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుక్కడపు మహేష్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రశ్నిస్తే అక్రమ కేసులా..

హుజూర్‌నగర్‌లో ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, దాడులు చేయడం సర్వసాధారణం అయిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మీడియాపై దాడికి పాల్పడడం పిరికి చర్య అన్నారు. పోలీసులు డిబేట్‌కు రక్షణ కల్పించకపోవడం విచారకరమని, డిబేట్‌కు రాకుండా ఎమ్మెల్యే మొహంచాటేసి దాడులకు ప్రేరేపించడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలు గౌరవించాలని సూచించారు. ప్రజాక్షేత్రంలో ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.



Next Story

Most Viewed