ఎమ్మెల్సీ బరిలో ఇండిపెండెంట్లు.. అధికార పార్టీ భారీ ఆఫర్

by  |
ఎమ్మెల్సీ బరిలో ఇండిపెండెంట్లు.. అధికార పార్టీ భారీ ఆఫర్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా..? అయితే, మీరు పోటీ నుంచి తప్పుకోండి.. మీ సామాజిక వర్గంతోపాటు మీకు పడాల్సిన ఓట్లు మాకు వేయించండి.. మా అభ్యర్థి గెలుపు తురువాత మీకు మంచి పదవి ఇప్పిస్తాం.. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థులకు కొందరు అధికార పార్టీ నాయకులు ఇస్తున్న ఆఫర్లు ఇవి.. తమకు మైనస్ ఉన్న సామాజికవర్గాలకు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థులను డమ్మీ చేసి, ఆ ఓట్లను వీరి ద్వారా వేయించుకోవాలని గులాబీ దళం స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆఫర్ల వల విసురుతున్న గులాబీ నేతలు ఓట్లు చీలకుండా చివరి ప్రయత్నంగా రాయబారాలు నడుపుతున్నట్లు సమచారం.

స్వతంత్రులకు వల..

ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార పర్వం ముగియడంతో శనివారం ప్రలోభాల పర్వానికి తెరలేపారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన ఓ అభ్యర్థికి అధికార పార్టీ నుంచి ఓ ఆఫర్ వెళ్లింది. సదరు స్వతంత్ర్య అభ్యర్థి సామాజిక వర్గం బలంగా ఉంది. ఇటీవల పలు సామాజిక కార్యక్రమాలను చేపట్టాడు. నిరుద్యోగుల తరపున పోరాటాలు చేశాడు. దీంతో ఆ ఓట్లలో చీలిక రాకుండా రాయబారం నడిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు సైలెన్స్ అయి.. ఆ ఓట్లు తమకు వేయిస్తే.. మచి పదవి ఇప్పిస్తామని చెప్పారు. ఇయనతోపాటు పలువురితో కూడా రాయబారాలు నడిపినట్లు తెలిసింది. ఆఫర్లు కూడా భారీగానే నడుస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ అవసరమైన అన్ని మార్గాలను వినియోగించుకొని గెలుపు తీరాలను చేరుకునేందుకు గులాబీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు.

గంపగుత్త ఓట్లపై నజర్…

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 93మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో కొందరికి సమాజంలో మంచి పేరుంది. కులాలు, వర్గాల ప్రతిపాదికన వీరు భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉంది. వీరితో మాట్లాడి తమ వైపు తిప్పుకుంటే గంపగుత్త ఓట్లను తమ అభ్యర్థికి వేయించుకునే అవకాశం ఉందని అధికార పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వ ఉపాధ్యాయులు మూడు గ్రూపులుగా చీలిపోయారు. ఒక్కో గ్రూపు ఒక్కో అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లలో మంచి పట్టున్న అభ్యర్థిని కన్వీన్స్ చేసి తమ పార్టీ అభ్యర్థికి ఓటేసేలా ఒప్పిస్తే.. ఆ వర్గానికి చెందిన టీచర్ల ఓట్లన్నీ వేయించుకోవచ్చునని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పట్టున్న సంఘాల ఓట్లను తమ ఖాతాలోనే వేసుకుని అధికార పక్షం బలపరిచిన సురభి వాణీదేవి గెలుపునకు అవసరమైన ఓట్ల కోసం వేట కొనసాగిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థుల బలాలు, కులాలు, మతాలను బట్టి ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. రాయబేరాలకు పెద్దలుగా వ్యవహారిస్తున్న వారికి తాయిలాలు అందజేస్తున్నారు.

పక్కా లెక్కలు…

టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపునకు అవసరమైన ఓట్లను సమకూర్చుకునే పనిలో ఉన్న అధికార టీఆర్ఎస్ లీడర్లు ఓ ప్రత్యర్థి వల్ల నష్టం జరుగుతుందోనన్న అంచనాలను రూపొందిస్తున్నారు. సమయం లేకపోవడంతో పక్కగా ప్లాన్ చేస్తున్నారు. దాని ప్రకారమే ముందడుగు వేస్తున్నారు. అధికార పార్టీ ఇచ్చిన ఆఫర్లను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్వీకరించే అవకాశం లేకపోవడంతో స్వతంత్రులను టార్గెట్ చేసుకొని కథ నడిపిస్తున్నారు. ఈసారి బరిలో దిగిన వాణీదేవిని ఎలాగైనా గెలుపించుకోవాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకొని వారి సామాజిక వర్గానికి ఉన్న ఓట్లను తమకు మళ్లీస్తే ‘మంచి’ పదవి ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అవసరమైతే మంత్రులతో మాట్లాడిస్తామని, లేదంటే కేటీఆర్ వద్దకు తీసుకువెళ్తామని మాట ఇస్తున్నారు. ఆర్థికంగానూ, పదవీ పరంగాను ఉన్నత స్థితిని కల్పిస్తామని రాయబారాలు నడుపుతున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా అధికార పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.



Next Story

Most Viewed