పద్మాక్షమ్మ భూములు కనిపించట్లే.. సర్వే నెం 880పై 420గాళ్ల కన్ను!

by  |
పద్మాక్షమ్మ భూములు కనిపించట్లే.. సర్వే నెం 880పై 420గాళ్ల కన్ను!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : పద్మాక్షమ్మ వారి ఆలయ భూములు కబ్జాకు గురైనట్టు కొన్నేళ్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆలయ భూముల రీ-సర్వేతో అది నిజమని మరోసారి రుజువైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి తెలిపారు. స‌ర్వేనెంబ‌ర్ 880పై క‌న్నేసిన 420 గాళ్లు క‌బ్జాల‌కు పాల్పడుతున్నారంటూ ఘాటుగా స్పందించారు. వ‌రంగ‌ల్‌లో ఆల‌య భూములు క‌బ్జాకు గుర‌వుతున్నా ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదంటూ రాకేష్‌రెడ్డి శ‌నివారం ఓ ప‌త్రిక ప్రక‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఒక్క పద్మాక్షమ్మ ఆలయ భూములే కాదు వరంగల్ జిల్లాలో అంతటా ఇదే పరిస్థితి ఉంద‌ని దుయ్యబ‌ట్టారు. భద్రకాళి అమ్మవారి దేవాలయం సమీపంలో హనుమాన్ దేవాలయ భూములు కూడా కబ్జాకు గురవుతున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం దారుణమ‌న్నారు. స్వయానా ముఖ్యమంత్రే ఆనాటి ఉద్యమ సమయంలో దేవాదాయ భూములు మింగేస్తున్నారని అన్నారని గుర్తుచేశారు. కానీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గతంలో కంటే ఎక్కువగా దేవాలయ భూములను మింగేస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తూ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అసలు నిజంగా దేవాలయ భూముల రక్షణపై చిత్తశుద్ధి ఉంటే వరంగల్ జిల్లాలో గల అన్ని దేవాలయ భూముల పైన రీసర్వే చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఇంతకముందు అవినీతి అంటే ఇరిగేషన్, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా అని ఇలా కొన్నే ఉండేవి. కానీ, ఇప్పుడు అన్ని శాఖలకు డెల్టా+మ్యూటేష‌న్‌ లాగా ప్రణాళికాబద్ధంగా అన్ని శాఖలకు విస్తరించింద‌ని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా దేవుడి మాన్యం భూములకు ఎసరు పెట్టారని, వీళ్ళ ఆకలితో గుడిని, గుడిలో లింగాన్ని మాయం చేసినా వీరి ఆకలి తీరేలా లేదన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఇప్పటికైనా మేలుకొని ప్రజలకు, భూ బాధితులకు న్యాయం చేయ్యాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములకు, దేవాలయ భూములకు రక్షణగా ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనియెడల ప్రజల కోసం ప్రత్యక్షంగా భూ కబ్జా మాఫియాపై పోరాడుతామని హెచ్చరిస్తున్నట్లు రాకేశ్ రెడ్డి వెల్లడించారు.


Next Story