దోమతెరల కోసం ఆళ్లపల్లి ఎదురుచూపు

by Ratna Kumari |

వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని 12 గిరిజన గ్రామాలకు ఇప్పటికీ దోమతెరలు అందలేదు.

దోమతెరల కోసం ఆళ్లపల్లి ఎదురుచూపు
X

దిశ, ఆళ్లపల్లి : వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని 12 గిరిజన గ్రామాలకు ఇప్పటికీ దోమతెరలు అందలేదు. ప్రతి ఏడాది జూన్–జూలై నెలల్లో ఆరోగ్య శాఖ ద్వారా పంపిణీ చేయాల్సిన దోమతెరలు గత రెండేళ్లుగా అందకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దోమల బెడదతో నిద్ర కరువు..

ఆళ్లపల్లి మండలంలోని గిరిజన గ్రామాల్లో రాత్రివేళ దోమల బెడద తీవ్రంగా ఉండటంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయే సమయంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమల సంఖ్య గణనీయంగా పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.

సీజనల్ వ్యాధుల భయం..

దోమతెరలు అందకపోవడంతో పాటు కొన్ని గ్రామాల్లో ఫాగింగ్, లార్వా నివారణ చర్యలు కూడా తగిన స్థాయిలో చేపట్టడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు..

గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ఏడాది దోమతెరలు పంపిణీ చేసేవారని, అయితే గత రెండేళ్లుగా పంపిణీ నిలిచిపోయిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. బడ్జెట్, టెండర్ల కారణంగానే ఆలస్యం జరుగుతోందా? లేక అసలు దోమతెరల కేటాయింపులే జరగలేదా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్..

ఆళ్లపల్లి మండలంలోని 12 గిరిజన గ్రామాలకు వెంటనే దోమతెరలు పంపిణీ చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రతి గ్రామంలో ఫాగింగ్ నిర్వహించడంతో పాటు లార్వా నివారణ చర్యలు చేపట్టాలని, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.దోమతెరల కోసం ఆళ్లపల్లి ఎదురుచూపు

Next Story