కారును పోలిన గుర్తుల్ని తొలగించండి !

by  |
కారును పోలిన గుర్తుల్ని తొలగించండి !
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ఎన్నికల చిహ్నమైన కారును పోలిన గుర్తుల్ని ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లేకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధికి ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఇలాంటి గుర్తుల ఇబ్బంది వస్తూ ఉందని, 2014అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సహా 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంటు ఎన్నికలు తాజాగా ముగిసిన దుబ్బాక ఉప ఎన్నికలోనూ తమ పార్టీ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నదని వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కమిషనర్ పార్ధసారధిని సోమవారం ఉదయం టీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు కలిసి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల కమిషనర్‌తో భేటీ అనంతరం వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్‌ను గుర్తింపు పొందిన పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందని, అధికారికంగా కేటాయించిన ఎన్నికల చిహ్నం కారు గుర్తును పోలినట్లుగా అనేక గుర్తులు ఉన్నాయని, వాటిని ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలగించాల్సిందిగా కోరామని తెలిపారు. తాజాగా ముగిసిన దుబ్బాక ఉప ఎన్నికలో సైతం కారు గుర్తును పోలిన రోటీమేకర్ గుర్తు కారణంగా తమ పార్టీ అభ్యర్థి ఓడిపోయారని పేర్కొన్నారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఇలాంటి గుర్తు కారణంగా భువనగిరి ఎంపీ అభ్యర్థి ఓడిపోయారని గుర్తుచేశారు. ఎన్నికల గుర్తుల గురించి టీఆర్ఎస్ పార్టీ గతంలోనూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను ఢిల్లీలో కలిసి వివరించామని వినోద్ కుమార్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందస్తుగా సారూప్యంగా ఉండే గుర్తులను తొలగించాల్సిందిగా కోరినట్లు తెలిపారు.



Next Story