గ్రేటర్ పీఠంపై ఎవరి ఆశలు వారివే..!

by  |
గ్రేటర్ పీఠంపై ఎవరి ఆశలు వారివే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో :

గ్రేటర్​ పీఠం అందరినీ ఊరిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశలు పెంచుకున్నారు. ఎలాగైనా దక్కించుకోవాలనే పంథంతో ఎవరికి వారీగా అంతర్లీనంగా పావులు కదుపుతున్నారు. ఈ సారి మేయర్‌గా జనరల్ మహిళకు రిజర్వేషన్ ఉన్నది. దీంతో సీనియర్ ప్రజాప్రతినిధులు ఎలాగైనా మేయర్ పదవిని తమ వారికే దక్కాలనే దృఢ నిశ్చయంతో ఎత్తులు వేస్తున్నారు. కూతురు, భార్య, కోడలును జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా సనత్‌నగర్, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు మేయర్ ​కుర్చీపై ఆశపడుతున్నారు. తమతమ గాడ్ ఫాదర్‌ను కలిసి మనసులోని మాటను వెల్లడించినట్టు సమాచారం. అయితే, ఈసారి బీసీ వర్గానికి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు వారి నియోజకవర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈపాటికే కార్పొరేటర్లుగా ఉన్న మరో ఇద్దరు మహిళలు సైతం పదవిపై ఆశలు పెంచుకున్నారు. వీరు కూడా గ్రేటర్‌కు చెందిన ప్రజాప్రతినిధుల కూతుళ్లు కావడం విశేషం. వారు కూడా పార్టీ అధినేతను కోరేందుకు సిద్ధమైనట్టు వారి మద్దతుదారులు వెల్లడిస్తున్నారు. అయితే, పోటీమాత్రం ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్యే ఉన్నట్టు తెలిసింది.

అమీర్‌పేట్, కుత్బుల్లాపూర్ డివిజన్లే కీలకం

సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అమీర్‌పేట్ డివిజన్ నుంచి ఓ ప్రజా ప్రతినిధి కోడలును కార్పొరేటర్ చేసి నేరుగా మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇందుకు టీఆర్ఎస్ అధిష్ఠానం అంతగా సానుకూలత చూపడం లేదని కూడా చర్చ జరుగుతోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి లేదా జీడిమెట్ల డివిజన్ నుంచి మరో ప్రజాప్రతినిధి భార్యను ఎన్నికల బరిలోకి దింపేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్టు ఆయన మద్దతుదారులు వెల్లడిస్తున్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌లో గౌడ్స్ బలమైన వర్గంగా ఉన్నారని, ఈ మారు మంత్రి పదవి రానందున ఆ వర్గానికి మేయర్ పదవి దక్కే అవకాశాలున్నాయని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చర్చకు తెరలేచింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్టు వచ్చి ఓడినందున ఈసారి మేయర్ పదవిని తన వారికే ఇవ్వాలని అధిష్ఠానం అనుమతిని మంత్రి తీసుకొచ్చుకుంటారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

ప్రస్తుత కార్పొరేటర్లకు స్థాన చలనం..

అమీర్‌పేట్ డివిజన్ నుంచి గెలిచిన ప్రస్తుత మహిళా కార్పొరేటర్ రెండుమార్లు గెలిచారు. అయితే, ఆమెను మరో డివిజన్ కు మార్చాలని ఆ ప్రజాప్రతినిధి నిర్ణయించినట్టు తెలిసింది. కుత్బుల్లాపూర్ డివిజన్‌లోనూ అక్కడి కార్పొరేటర్ ను మరో డివిజన్ కు మార్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అక్కడి కార్పొరేటర్లు సైతం ఇందుకు సానుకూలంగా ఉన్నారని స్థానికులు వెల్లడిస్తున్నారు. వారి ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తామని సూచన ప్రాయంగా తెలిపారని స్థానికుల్లో చర్చ జరుగుతుంది.

ఇద్దరు కార్పొరేటర్లలోనూ ఆశలు..

ఈపాటికే కార్పొరేటర్లుగా ఉన్న మరో సీనియర్ ఎమ్మెల్యే కూతురు, ఎంపీ తనయురాలు మేయర్ పదవిని ఆశిస్తున్నారు. వీరు వారి తండ్రిలను అధిష్ఠానాన్ని అడగాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ పరిధిలో చాలా కాలం నుంచి గౌడ్స్ కు మంత్రివర్గంలో ప్రాధాన్యత లభించలేదని, దేవేందర్ గౌడ్, పద్మారావు గౌడ్ లకు మంత్రి పదవులు వచ్చాయి. ఈ మారు డిప్యూటీ పదవితో సరిపెట్టింది. అయితే మేయర్ పదవిని ఆ వర్గానికి కేటాయించే అవకాశాలు అధికంగా ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతుంది.



Next Story