ప్రభుత్వ భూమిలో టీఆర్ఎస్ నాయకుడి గెస్ట్ హౌజ్.. అధికారుల రాకతో..

by  |
ప్రభుత్వ భూమిలో టీఆర్ఎస్ నాయకుడి గెస్ట్ హౌజ్.. అధికారుల రాకతో..
X

దిశ, శేరిలింగంపల్లి : ఆభూముల చుట్టూ ఇన్నాళ్లు ఎన్నో వివాదాలు, మరెన్నో పంచాయతీలు. కోర్టుల్లో కేసులు, స్థలం విషయంలో ఆధిపత్య పోరు. వీటన్నింటికి తెరదించుతూ ఆ స్థలం చుట్టూ వేసిన కంచెను నిర్మొహమాటంగా నేలమట్టం చేశారు రెవెన్యూ అధికారులు. బుధవారం ఉదయమే పదుల సంఖ్యలో జేసీబీలు, వందలాదిమంది పోలీసు బందోబస్తు మధ్య కూకట్ పల్లి మండలం హైదర్ నగర్ డివిజన్ సర్వే నెంబర్ 163లో ఉన్న సీఎస్ 14 భూముల చుట్టూ వేసిన కంచెలను తొలగించారు రెవెన్యూ సిబ్బంది.

మొదటి నుండి వివాదాలే..!

కూకట్ పల్లి మండలం హైదర్ నగర్ డివిజన్ సర్వే నెంబర్ 163లో ధరణి రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తంగా 144.06 గుంటలు ఉండగా, అది ఖారీజు ఆజరి సర్కారీ అని ఉంది. బై సర్వే నెంబర్లలో 163/అ/1 లో ఐడీపీఎల్ హౌసింగ్ సొసైటీ వారికి 15 ఎకరాలు, 163/1/2లో దుర్గామాత హౌసింగ్ సొసైటీకి 16 ఎకరాలు, 163ఇ1లో బి సుధాకర్ పేరున 0. 23 గుంటలు, 163 ఇ 2లో బి. రమేష్ పేరున 0. 23 గుంటలు, 163 ఇ 3లో ఎం. దేవేంద్రనాథ్ పేరున 0.23 గుంటలు, 163 ఇ4 లో ఎస్ కే శ్రీనివాస్ పేరున 0.23 గుంటలు, 163 ఇ 5లో బి. శ్రీలత పేరున 0.23 గుంటలు, 163 ఇ6 లో అఫ్జలున్నీసా బేగం పేరున 0.23 గుంటలు, 163 ఇ 7లో, బి. నాగదేవమ్మ 0.22 గుంటలు ఉండగా, 163 ఈలో కవిత భర్త బద్రు పేరున 12 గుంటలు ఉంది. 163 ఉ 1లో ఏ.వీ సుబ్బారెడ్డి పేరున 3.24 ఎకరాలు, 163 ఉ 2లో కె. నవీన్ కుమార్ పేరున 3.24 ఎకరాలు ఉన్నట్లు ధరణి రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే ఇవన్నీ కూడా కోర్టు వివాదాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

కోర్టుల్లో ఉన్న కేసులు..

హైదర్ నగర్ సర్వే నెంబర్ 163లో ఉన్న భూములకు సంబంధించి ఇంకా కోర్టు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రిలిమినరీ డిక్రీ తమకు అనుకూలంగా వచ్చిందంటూ కొంతమంది అందులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఒకరిద్దరు ఏకంగా గెస్ట్ హౌస్‌లు కూడా నిర్మించుకున్నారు. ఇందులో ఓ గెస్ట్ హౌస్ టీఆర్ ఎస్ నాయకుడిది ఉన్నట్లు సమాచారం. కానీ ఇదంతా సీఎస్ 14 కింద ఉన్న భూములని, వాటి హక్కులు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అవన్నీ సీఎస్ 14 భూములు

కూకట్ పల్లి మండలం హైదర్ నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 163లో ఉన్న భూములు సీఎస్ 14 కింద ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. వాటిపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ప్రభుత్వం చూసుకుంటుంది. కోర్టులు ఫైనల్ చేస్తాయి. అంతవరకు అందులో ఎవరూ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీలులేదు.

గోవర్ధన్ కూకట్ పల్లి తహసీల్దార్

Next Story

Most Viewed