ఎమ్మెల్సీగా కసిరెడ్డికి మరో చాన్స్.. రాజ్యసభకు దామోదర్ రెడ్డి..?

by  |
ఎమ్మెల్సీగా కసిరెడ్డికి మరో చాన్స్.. రాజ్యసభకు దామోదర్ రెడ్డి..?
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సిట్టింగ్ ఎమ్మెల్సీలలో ఒకరైన కసిరెడ్డి నారాయణరెడ్డికి మరో అవకాశం ఇవ్వడానికి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతల అభిప్రాయాలను ఇప్పటికే తెలుసుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. కాగా, ఆ రెండు స్థానాలు నాగర్ కర్నూలు జిల్లాకే చెందడం, ఇద్దరు ఓసీలే కావడంతో ఈసారి జరుగుతున్న ఎన్నికలలో ఒక స్థానాన్ని మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు కేటాయించాలని జిల్లా నేతలు చేసిన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక స్థానాన్ని కేటాయించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం ఇప్పటికే తీసుకుంది.

ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కసిరెడ్డి నారాయణరెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. మరో ఎమ్మెల్సీగా ఉన్న దామోదర్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ మారే సమయంలో షరతులు విధించక పోవడం, వివాదరహితుడిగా ఉండడం వల్ల దామోదర్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం.

వచ్చే ఫిబ్రవరిలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న క్రమంలో దామోదర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజకీయంగా తనకు కాకుండా, తన కుమారునికి అవకాశం ఇవ్వాలని దామోదర్ రెడ్డి పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసినప్పటికీ వివాదరహితుడిగా ఉన్న దామోదర్ రెడ్డిని రాజ్యసభకు పంపాలన్న నిర్ణయానికి వచ్చినట్లు, ఇందుకు సంబంధించిన చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. కాగా మహబూబ్‌‌నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పలువురు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని ఆశించినప్పటీకి ఈ స్థానం నుండి అందరితో కలుపుగోలుగా, పార్టీకి ప్రయోజనం చేకూర్చే బీసీ నాయకునికి అవకాశం కల్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఒకటి రెండు రోజులలో అభ్యర్థుల ఎంపిక అంశం కొలిక్కి రావచ్చునని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ స్థానం నుండి తమకు అవకాశాలు కల్పించాలని ప్రయత్నాలు సాగిస్తున్న నేతలలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు భాద్మీ శివ కుమార్, జేపీఎంసీ చైర్మన్ రవి కుమార్, ఉమ్మడి జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు మనెమోని సత్యనారాయణ, ఉద్యమకారుడు అయినా మున్నూరు రవి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరితో పాటు పార్టీ నాయకులు, ఉద్యమకారులు టికెట్ ఆశిస్తూ వారివారి మార్గాల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఆశలు పెట్టుకున్న మైనార్టీ నేతలు..

రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ అధిష్టానం మైనార్టీలకు ఏమాత్రం అవకాశం కల్పించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశం కల్పిస్తుంది అన్న ఆశతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు మైనార్టీలు ఎమ్మెల్సీ టికెట్ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇంతియాజ్ ఇసాక్, తెలంగాణ జాగృతి మాజీ నేత, విద్యాసంస్థల నిర్వాహకులు డాక్టర్ ఇబ్రహీం ఖలీల్ ఆశిస్తున్నారు.ఈ మేరకు అధిష్టానంతో ఉన్న పరిచయాలతో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed