ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న ప్రజాప్రతినిధి.. పట్టించుకోని అధికారులు

by  |
ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న ప్రజాప్రతినిధి.. పట్టించుకోని అధికారులు
X

దిశ ప్రతినిధి, మెదక్ : కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ప్రాజెక్టు రంగనాయక సాగర్. చుట్టూ నీరు, మధ్యలో ఆఫీసు… ఐలాండ్ తలపిస్తున్న రంగనాయక సాగర్ ప్రస్తుతం అన్యాక్రాంతమైతుంది. ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిలో మిగిలిన కొంత భాగాన్ని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఏకంగా ట్రాక్టర్లు పెట్టి పొలంగా మార్చి నాట్లు సైతం వేసుకుంటున్నారు. అయినా వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రాజెక్టు భూములు కబ్జాకు గురవుతున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష బీజేపీ నాయకులు చెప్పిన స్పందన లేదు. దీని వెనుక బడా నేతల హస్తం ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న ప్రజాప్రతినిధి…

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో రంగనాయకసాగర్ ప్రాజెక్టు నిర్మించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణం కోసం మెగా కంపెనీ ఆధ్వర్యంలో ప్రభుత్వం భూమిని రైతుల నుండి సేకరించింది. ప్రస్తుతం రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి గతేడాది నీటిని సైతం నింపారు. అయితే ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిలో కొంత భాగం మిగిలి ఉంది. దానిపై కన్నేసిన ఓ ప్రజాప్రతినిధి యధేచ్చగా ట్రాక్టరుతో సాగు చేసి పొలంగా మార్చి వరి పంటకు నాటేశారు. వారొక్కరే కాదు చుట్టూ పక్కల మిగిలిన భూమిని చాలా మంది కబ్జా చేశారని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి అన్యాక్రాంతం కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పట్టించుకొని అధికారులు…

ప్రాజెక్టు భూమి అన్యాక్రాంతమవుతుందని బీజేపీ నాయకులు చెప్పినా ప్రాజెక్టు అధికారులు స్పందించడం లేదు. భూమిని కబ్జా చేసుకున్న ప్రజాప్రతినిధికి ఆ గ్రామ బడా నేత అండదండలు ఉన్నాయని, అందుకే ప్రాజెక్టు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మాత్రం ప్రాజెక్టులో నీళ్లు రాకపోవడంతో ఓ రైతు పశువుల కోసం జొన్న అలకగా … అతనిపై మాత్రం వెంటనే ప్రాజెక్టు ఏఈ కేసు నమోదు చేశారు. అప్పటి చిన్నకోడూరు ఎస్ఏ సాయంతో జొన్నను తొలగించారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు భూమి అన్యాక్రాంతమైన విషయం బహిర్గతమైన … ఆ ప్రజాప్రతినిధి స్వయంగా ట్రాక్టర్ పెట్టి దున్నిన సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై ప్రతిపక్ష బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అధికారులు ఇలా స్పందించకపోవడం భావ్యం కాదని, వెంటనే ఆ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గౌడ కులస్తులు ..

ప్రాజెక్టు నిర్మాణంలో అత్యధిక భూములు కోల్పోయింది గౌడ కులస్తులే. వారి కుల దైవం రేణుక ఎల్లమ్మ దేవాలయం కూడా ప్రాజెక్టులో మునిగిపోయింది. అయితే ఆ సందర్భంలో గౌడ కులస్తులు కోరిన చోట దేవాలయాన్ని నిర్మించి ఇస్తామని మంత్రి హరీశ్ రావు, ప్రాజెక్టు అధికారులు చెప్పారు. కానీ ఆ హామీ అమలు కాలేదు. గౌడ కులస్తులు హెలిప్యాడ్ వద్ద ఎల్లమ్మ దేవాలయాన్ని కట్టివ్వాలని కోరగా గౌడ కులస్తులు భూమి ఆక్రమించారని ఆరోపిస్తూ 16 మంది పై కేసు నమోదు చేశారు. ఇది ప్రాజెక్టు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నిర్మించడం సాధ్యం కాదని చెప్పారు. చేసేదేమి లేక ప్రాజెక్టు వెనకలా ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి యథేచ్చగా భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్న ప్రాజెక్టు అధికారులు ఎందుకు స్పందించడం లేదు. మాకు ఓ గుంట భూమి కావాలన్న ఇవ్వని అధికారులు .. ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధి ఎకరాల చొప్పున సాగు చేసుకుంటున్నా స్పందించకపోవడంపై గౌడ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తక్షణమే జిల్లా మంత్రి హరీశ్ రావు స్పందించాలని గౌడ కులస్తులు, ప్రతిపక్ష బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed