టీఆర్ఎస్ తండ్రీ కొడుకుల పార్టీ: లక్ష్మణ్

by  |
టీఆర్ఎస్ తండ్రీ కొడుకుల పార్టీ: లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఊహించని ఝలక్ ఇచ్చారని, అహంకారంతో వ్యవహరిస్తున్న పార్టీకి చెంపపెట్టులాంటి సమాధానం చెప్పారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తండ్రీ కొడుకుల పార్టీ అని, మజ్లీస్ అన్నదమ్ముల పార్టీ అని అన్నారు. ఈ రెండూ లోపాయకారీగా కుమ్మక్కయ్యాయనీ, పైకి కొట్లాడుకుంటూ లోపల దోస్తీ చేస్తున్నాయని తెలిపారు. నగరంలో ఆదివారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ వ్యతిరేకత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించిందన్నారు. ఎన్నికలేవైనా గెలుపు తమదే అని అహంకారంతో ఉన్న పార్టీకి ఓటర్లు జీహెచ్ఎంసీలో ఓటమిని రుచి చూపించారని చెప్పారు.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ ఆ పార్టీకి షాక్ ఇచ్చారని అన్నారు. వంద సీట్లు అని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పుకున్నా అందులో సగమే ఇచ్చారని పేర్కొన్నారు. సారు.. కారు.. పదహారు అని లోక్‌సభ ఎన్నికల్లో గంభీర ప్రకటనలు చేసినా చివరకు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. ఆరేళ్ళ ఆ పార్టీ పనితీరును చూసిన తర్వాత ప్రజలు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్పందించినట్లుగా ఇకపైన కూడా స్పందిస్తారని, భవిష్యత్తు బీజేపీదేనని అన్నారు. టీఆర్ఎస్ భ్రమల్లోంచి ప్రజలు ఒక్కరొక్కరుగా బైటపడుతున్నారన్నారు. ప్రజలు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల వైఖరితో విసిగిపోయారన్నారు.

Next Story

Most Viewed