ప్రాజెక్టు పూర్తయ్యేనా..?

by  |
ప్రాజెక్టు పూర్తయ్యేనా..?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఆరేళ్లు గడుస్తున్నా నేటికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇస్తున్నారని తర్వాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కల గానే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే బంగారు పంటలు పండుతాయని ఎదురుచూస్తున్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీనికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి , నల్లగొండ జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరందనున్నది. శ్రీశైలం బ్యాక్ వాటర్ సేకరించి రిజర్వాయర్లను నింపి సాగునీరుందించాలని ప్రణాళికలు చేశారు.

రంగారెడ్డి, నల్లగొండ జిల్లా ప్రజలకు ఏడాదిలో సాగునీరు అందిస్తామని చెప్పిన కేసీఆర్ మాటాల్లో వాస్తవం లేదు. ఎందుకంటే ఏడాది పూర్తైనప్పటికీ భూ సేకరణ జరగలేదు, రిజర్వాయర్, కాల్వల నిర్మాణానికి టెండర్లు వేయలేదు. ఇలాంటప్పుడు రంగారెడ్డి జిల్లా ప్రజలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఈ ప్రాజెక్టుల్లో చివరి రిజర్వాయర్ రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గంలోని లక్ష్మిదేవి పల్లి వద్ద నిర్మించనున్నారు. లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే తప్పా జిల్లా రైతాంగానికి సాగునీరు ఇవ్వడం కష్టం. ఈ రిజర్వాయర్ కు ముందున్న లోకిరేవు, కర్వెన, వట్టెం రిజర్వాయర్లు నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. శ్రీశైలం నుంచి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, లోకిరేవు, కేపీ లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలు క్రమంగా కొనసాగించాలి. అయితే కర్వెన రిజర్వాయర్ నుంచి నల్లగొండలోని 30వేల ఎకరాల భూములకు, లోకిరేవు నుంచి లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్లోకి నీటి తరలించి రంగారెడ్డిలోని 2.70లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా లోకిరేవు నుంచి హైదరాబాద్ వాసులకు 30 టీ ఎంసీల తాగునీరు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు నిర్మాణాలే పూర్తి కాలేదు. లోకిరేవు, లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుంది.

రిజర్వాయర్ నిర్మాణానికి భూ సర్వే..

జిల్లాలో నిర్మించే లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి భూ సర్వే పనులు చేపడుతున్నట్లు ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఇంజనీర్ అధికారి తెలిపారు. గత కొంత కాలంగా సర్వేలతోనే కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు భూ సేకరణ చేయలేదని ఆ అధికారి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వకపోవడంతోనే మందకొడిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్ నుంచి వికారాబాద్ జిల్లాలకు వెళ్లే కెనాల్ వరకు భూ సర్వే చేశారు. ఒకవేళ భూసేకరణ ప్రారంభిస్తే రైతులకు చెల్లించే నష్టపరిహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది.

సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంపై నిర్లక్ష్యం

మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల భూభాగం కృష్ణా బేసిన్ లోనే ఉంది. ఈ జిల్లాలకు కృష్ణా నీరు తప్పా వేరే దిక్కులేదు. ఇలాంటాప్పుడు సీఎం కేసీఆర్ జల దోపిడిని నిలదీయకుండా మౌనం వహించడం వెనుక పెద్ద కుట్ర ఉంది. రంగారెడ్డి జిల్లా లో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నీటిని తీసుకొని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే. లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.

-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ

నీళ్ల కోసం ఎదురుచూపు..

రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తే సాగు నీరు వస్తుందని ఎదురుచూస్తున్నాం. పదేండ్లుగా ఈ ప్రాజెక్టు పనుల్లో పురగతి లేదు. చివరికి ప్రాజెక్టు పూర్తి చేస్తారా ఇలాగే వదిలివేస్తారా అనే అనుమానం ఉంది. నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి వద్ద ప్రాజెక్టును త్వరగా నిర్మిస్తే దాదాపు నియోజకవర్గం అంతా సస్యశ్యామలం అవుతుంది. మా మండలానికి కూడా కాలువలు రావడంతో పంటలు పండించుకునేందుకు రైతులకు మేలు జరుగుతుంది. ఇప్పటికైనా త్వరగా పూర్తి చేయాలి.

-జీ మహాలింగం, రైతు,పాలమూరు

Next Story

Most Viewed