ఓ కేసులో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ భర్త అరెస్ట్

by  |
ఓ కేసులో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ భర్త అరెస్ట్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఓ భూ వివాదంలో అధికార టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్తతోపాటు మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్‌లోని ద్వారకానగర్ పేజ్ 2లోని సర్వే నెంబర్ 69లోని 2.04 ఎకరాల స్థలంలో భూత్కురు శ్రీరాములు అనే వ్యక్తి లేఅవుట్ వేసి ప్లాట్లను విక్రయిస్తున్నాడు. ఈ వెంచర్ పక్కనే అనంతుల పురేందర్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 10వ తేదీన శ్రీరాములు ఓ ప్రైవేట్ సర్వేయర్‌‌తో సర్వే చేయించారు. పురేందర్ రెడ్డి తన వెంచర్ కు సంబంధించిన 150 గజాల స్థలం అక్రమించారని శ్రీరాములు గొడవకు దిగాడు.

పురేందర్ రెడ్డి తన స్థలానికి సంబంధించిన పత్రాలు తీసుకొని రావాలనడంతో ఇధ్దరి మధ్య మాట మాట పెరిగింది. దీంతో శ్రీరాములు బోడుప్పల్ కార్పొరేటర్ భర్త బంధారం శ్రీధర్ గౌడ్ అతని అనుచరులు రాఘవేందర్, బి.శ్రీనివాస్, బి.రాజుకుమార్, బి.శ్రీరాములు గౌడ్, బంధారం లక్ష్మణ్, బి.శ్రీహరిలతో కలిసి పురేందర్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి అతనిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడిని పురేందర్ రెడ్డి కుమారుడు మొబైల్ లో చిత్రీకరిస్తుండగా ఆ బాలుడిని సైతం కొట్టి వీడియోలను డిలీట్ చేశారు. జరిగిన విషయం ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయారు.

గాయపడిన పురేందర్ రెడ్డిని అతని భార్య అనంతుల భానోదయ 108 వాహనంలో ఉప్పల్‌లోని అదిత్య ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి భార్య మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Next Story