రైతులను తప్పుదోవ పట్టించేందుకు టీఆర్ఎస్ కుట్రలు: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

by  |
రైతులను తప్పుదోవ పట్టించేందుకు టీఆర్ఎస్ కుట్రలు: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి, మహబూబ్‌నగర్: హుజురాబాద్ ఉప ఎన్నికలో రైతులు బీజేపీ వైపు మొగ్గు చూపడంతో ఖంగుతిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా వరి కిరికిరి చేస్తున్నారని బీజేపీ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొంటాం అని స్పష్టంగా చెబుతుంది. గత వాన కాలానికి సంబంధించి ఇవ్వవలసిన ధాన్యాన్ని కేంద్రానికి ఇవ్వకుండా, ఇప్పుడు ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, వచ్చే యాసంగి కాలాన్ని గురించి అనవసరపు మాటలు మాట్లాడుతూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

వరి ధాన్యం కొనుగోలు కు సంబంధించి సుతిలి దారాలు, గన్ని బ్యాగులు, బియ్యం కొనుగోలు, అందుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారన్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు అన్ని రాష్ట్రాల అధికార యంత్రాంగం తో సమావేశాలు నిర్వహిస్తారన్నారు. ఎంత ధాన్యం పండింది, ఎంత సేకరించాలి తదితర అంశాలను గురించి నిర్ణయాలు అధికారులే తీసుకుంటారని చెప్పారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చీటికి మాటికి మంత్రులను, ఎంపీలను ఢిల్లీకి పంపు తున్నారన్నారు. ఎవరు వెళ్లినా ముందుగా ప్రధాన మంత్రిని, మంత్రులను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాల పర్యటన లో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లి అక్కడ తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర అధికార పార్టీ నేతలు చేసే కుట్రలు, కుతంత్రాలను ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ వర్ధన్ రెడ్డి, కిష్టయ్య, నాగేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రామకృష్ణ, సురేందర్ రెడ్డి, అంజయ్య, చిన్న వీరయ్య, కొండ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed