ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిమళిస్తున్న ‘గులాబీ’

by  |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిమళిస్తున్న ‘గులాబీ’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జరుగుతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు దాదాపు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు చేస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎలిమినేషన్ ఉంటుంది. నల్గొండ స్థానంలో 71మంది అభ్యర్థులు పోటీ చేయగా, ఇప్పటివరకూ 68 మందిని ఎలిమినేట్ చేశారు. వారికి వచ్చిన ఓట్లను మిగతా వారికి పంచుతున్నారు. మిగిలిన ముగ్గురిలో మూడో స్థానంలో ఉన్న కోదండరామ్ ఓట్లను మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు పంచే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.

మొదటి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,22,638 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు 99,210 ఓట్లు నమోదయ్యాయి. ఇప్పటికే పల్లాకు 23,428 ఓట్ల అధిక్యత ఉంది. ఇక కోదండరామ్‌కు వచ్చిన 89,409 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను ఇద్దరికీ పంచితే తీన్మార్ మల్లన్నకు దాదాపు కనీసం 50 వేల ఓట్లు వస్తే గానీ గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. చెల్లుబాటైన ఓట్లలో 1,83,168 ఓట్లు ఎవరికి వస్తే, వారినే విజేతగా ప్రకటిస్తారు.

ఇక, హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి స్థానంలో 93 మంది అభ్యర్థులు పోటీ చేయగా, ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న స్వతంత్ర్య అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 67,383 ఓట్లు వచ్చాయి. వీటిని మిగిలిన ఇద్దరు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు రెండో ప్రాధాన్యత ఓట్ల కింద పంచుతున్నారు. ఇప్పటివరకూ టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 1,28,010 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 1,19,198 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం నమోదైన ఓట్ల ప్రకారం.. టీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీపై 8,812 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానంలో 3,37,039 ఓట్లు పోలవ్వగా, 1,68,520 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంఖ్యను అభ్యర్థులెవరూ సాధించలేకపోవడంతో, మిగిలిన ఇద్దరిలో ఎవరికి అధిక ఓట్లు వస్తే వారినే విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. నాగేశ్వర్ ఓట్లను ఇద్దరికీ పంచితే.. 35వేల ఓట్లకుపైగా ఓట్లు వస్తేగాని బీజేపీ అభ్యర్థికి విజయం సాధ్యం కాదు. మిగిలిన ఇద్దరు అభ్యర్థుల్లో రెండో ప్రాధాన్యత ఓటు రాని సందర్భంలో మూడో ప్రాధాన్యత ఓటు ఉన్నా కూడా అభ్యర్థుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు.


Next Story

Most Viewed