టీఆర్ఎస్, బీజేపీలు దోస్తీ, కుస్తీ నాటకాలు ఆపాలి: మధుయాష్కీగౌడ్

by  |
madhu goud
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్, బీజేపీలు పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు ఆపి ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ కేసీఆర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు.. తెలంగాణ గురించి కేసీఆర్ కే చెబుతారా? అంటే ప్రెస్ మీట్లలో ఫైర్ అయ్యే కేసీఆర్ కు అసలు తెలంగాణ గురించి ఏమీ తెలియదని.. రాష్ట్రానికి ఏమి కావాలో అసలు అవగాహన లేదు’ అని మండిపడ్డారు.

కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా… ఇప్పుడు కేటీఆర్.. కేంద్రంతో కుస్తీ పడుతున్నట్లు పెద్దపెద్ద డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో తెలంగాణ విభజన చట్టంలో నాటి కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన వాటి గురించి కేసీఆర్ ప్రభుత్వం ప్రస్తావన చేసిందా? అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ పార్క్, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవన్నీ విభజన చట్టంలోని అంశాలేనని వీటిపైనా ఈ ఏడేళ్లలో ఏనాడైనా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసిందా.. కనీసం అడిగిందా? అని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వానికి ఏడేళ్లుగా పార్లమెంట్ లో అండగా నిలిచిన కేసీఆర్.. ఇప్పుడు గల్లీల్లో నాటకాలు ఆడుతూ అండగా నిలిచాడన్నారు.

కేంద్రం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని అంటే ఇన్నేళ్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తీసుకురాలేకపోయాని నిస్సిగ్గుగా కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించినట్లే అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీతో కుస్తీ, డ్రామాలు ఆడేందుకు సమయం ఉంటుంది కానీ.. ధరలు తగ్గి అయోమయంలో ఉన్న పత్తి రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు సమయం ఉండదని మండిపడ్డారు. వారం రోజుల్లోనే క్వింటాలు పత్తికి రూ. 1000 తగ్గిందని, వరంగల్ జిల్లా సహా ఎనుమాముల మార్కెట్ సహా ఇదే పరిస్థితి ఉందని పత్రికల్లో వస్తోందని, దీనిపై సంబంధిత మంత్రిగానీ.. సీఎంగానీ స్పందించక పోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed