దూసుకుపోతున్న టీఆర్ఎస్, బీజేపీ.. హస్తం డీలా 

by  |
దూసుకుపోతున్న టీఆర్ఎస్, బీజేపీ.. హస్తం డీలా 
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, నల్లగొండ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని అన్ని ప్రాధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నా్యి. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులే కాకుండా పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విస్తృతంగా తిరుగుతున్నారు. ఇప్పటికే ఓ విడుత అన్ని నియోజకవర్గాలను చుట్టివచ్చారు. సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు, సభలతో దూసుకెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీరాములు నాయక్ మాత్రం నామమాత్రంగానే ప్రచారం నిర్వహిస్తున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చర్చించుకోవడం గమనార్హం. ఈ ఎన్నిక ఫలితాల ప్రభావం వచ్చే కార్పొరేషన్ ఎన్నికలపై స్పష్టం కనిపిస్తుందని.. అయినా అలసత్వం ప్రదర్శించడం తగదంటున్నారు హస్తం కార్యకర్తలు.

పట్టించుకునే వారేరి..

ఖమ్మం కేంద్రంలో ఇటీవల జరిగిన అన్ని జిల్లాల డీసీసీ సభ్యుల సమావేశానికి రాష్ట్రస్థాయి నేతలు హాజరుకావడం.. మీటింగ్ కూడా సక్సెస్ కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయస్థాయి నేతల్లో జోష్ పెరిగింది. సీఎల్పీ నేత భట్టి అన్నీ మీదేసుకుని నేతలందరినీ ఏకం చేశారు. ఇక తమ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అనుకున్న హస్తం కాడర్.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఎవరూ రాకపోవడంతో మళ్లీ నిరాశలోకి వెళ్తున్నారు.. భట్టి విక్రమార్క రైతు పాదయాత్ర చేస్తుండడంతో జిల్లా నేతలెవరూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఆసక్తి కనబర్చడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి సైతం ఇతర పార్టీల అభ్యర్థులకు దీటుగా ప్రచారం నిర్వహించడం లేదని.. ఇక పార్టీ అభ్యర్థి గెలుపు పక్కన పెడితే.. ఆశించిన స్థాయిలో ఓట్లు రాకుంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లోనే తలెత్తుతోంది.

దూసుకుపోతున్న అధికార పార్టీ అభ్యర్థి..

అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విస్తృతంగా దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ తరఫున మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామానాగేశ్వరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మె్ల్యేల సహాయంతో నియోజకవర్గాల వారీగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ శ్రేణులను సైతం పల్లా గెలుపుకోసం కృషి చేయాలని కోరుతున్నారు. శనివారం సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ, సభ గ్రాండ్ సక్సెస్ కావడం.. యువత కూడా భారీ స్థాయిలో హాజరు కావడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయంగానే చెపుతున్నారు ఆ పార్టీ నేతలు.

ఎవరికి వారు గెలుపు ధీమాలో..

ఖమ్మం, నల్లగొండ, వరంగల్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ అభ్యర్థి సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మీటింగ్‌లు, ఆత్మీయ సమ్మేళనాల పేరిట యూత్ లోకి వెళ్తున్నారు. అంతేకాదు యువ తెలంగాణ అభ్యర్థి రాణి రుద్రమ, తెలంగాణ జనసమితి అభ్యర్థి కోదండరామ్, వామపక్షాల అభ్యర్థి జయసారథితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వీరికి కూడా పట్టభద్రులు మద్దతిస్తున్నారు. కాలేజీలు, పాఠశాలలు, గ్రౌండ్లు, కూడళ్లలో ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉద్యోగ సంఘాలను సైతం కలుస్తూ మద్దతు తెలపాలని కోరుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు వీరు కూడా దూకుడు మీదుండడంతో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రచారంలో వస్తున్న రెస్పాన్స్‌ను బట్టి ఎవరికి వారు గెలుపు ధీమాలో ఉన్నారు. పట్టభద్రులు, యువత తమవైపే ఉన్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు.


Next Story