అడుగడుగున అడ్డంకులు.. చివరి రోజు ఫీల్డ్ అసిస్టెంట్ల ప్లాన్ ఏంటి..?

by  |
అడుగడుగున అడ్డంకులు.. చివరి రోజు ఫీల్డ్ అసిస్టెంట్ల ప్లాన్ ఏంటి..?
X

దిశ, హుజూరాబాద్: ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి. 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను గతేడాది మార్చిలో విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ.. జూలై 12న ఫీల్డ్ అసిస్టెంట్లు హుజూరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, ఉప ఎన్నికల్లో 1000 మందితో నామినేషన్లు వేస్తామని ప్రకటించారు.

కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెల్లడించిన వెంటనే తమ ప్రణాళికలు అమలు చేయడానికి సమాయత్తం అయ్యారు. నామినేషన్ స్వీకరణ ప్రారంభమైన అక్టోబర్ 1వ తేదీన 10 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి ఉదయం 11 గంటలకు చేరుకొని నామినేషన్ పత్రాలు ఇవ్వాలని అడుగగా.. మధ్యాహ్నం రావాలని సంబంధిత అధికారులు సూచించారు. కొందరికి నామినేషన్ పత్రాలు అందజేసినప్పటికీ అప్పటికే స్వీకరణ సమయం దాటిపోయింది.

ఆ తర్వాత వరుసగా రెండు రోజులు సెలవు దినాలు కావడంతో సోమవారం తిరిగి ముగ్గురు నామినేషన్లు సమర్పించడానికి వెళ్లగా కొవిడ్ రెండో డోస్ వాక్సిన్ వేసుకొని, వేసుకున్నట్టు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని వెనక్కిపంపించారు. అకారణంగా తమను అడ్డుకుంటున్నారని ఆందోళనకు దిగిన 10 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను కొవిడ్ నిబంధనలు పాటించలేదని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించి.. రాత్రి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

కొవిడ్ నియమ, నిబంధనలు పాటించడం లేదని పోలీసు అధికారులు అడ్డుకున్నప్పటికీ పట్టు వదలకుండా నిత్యం హుజూరాబాద్‌కు వచ్చిన ఫీల్డ్ ఆసిస్టెంట్లు ఎట్టకేలకు గురువారం ఇరువురిచే 2 నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న 70 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నికల నియమావళి, కొవిడ్ నిబంధనలు పాటించలేదని పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నామినేషన్‌ల స్వీకరణ చివరి రోజైన శుక్రవారం మరి కొన్ని నామినేషన్లు దాఖలు చేసి తమ నిరసన కొనసాగిస్తామని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జేఏసీ చైర్మన్ శ్యామలయ్య తెలిపారు.

Next Story

Most Viewed