అక్కడ ప్రాణం దక్కాలంటే.. రిస్క్ చేయాల్సిందే?

by  |
agency area
X

దిశ, కొత్తగూడ: ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో ఐదేండ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నా.. ఈ గిరిజనుల రాతలు మాత్రం మారట్లేదు. ఏండ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవట్లేదు. ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ, గంగారం మండలాల్లో వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వ మోసపూరిత హామీల కారణంగా గిరిజనులకు అత్యవసర వైద్యం అందని ద్రాక్షగా మారిపోయింది.

అందరికీ అందని అంబులెన్స్ సేవలు

కొత్తగూడ మండలంలోని ముస్మి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ భార్య గర్భిణీ కావడంతో ఇటీవల దగ్గరలో ఉన్న తన పుట్టినిల్లు కర్నగండి గ్రామానికి వెళ్లింది. శనివారం పురిటి నొప్పులు ఎక్కువవడంతో అంబులెన్సుకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ ముస్మి గ్రామ శివారు వరకు చేరుకుంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది చేతులెత్తేసి, అక్కడే నిలిచిపోయారు. దీంతో చేసేదేంలేక, నొప్పులు తీవ్రం కావడంతో ఓ ప్రైవేట్ వాహనం అద్దెకు తీసుకొని అందులో బయలుదేరారు. అది కాస్త సగం దూరానికే మొరాయించడంతో ఆందోళన చెందారు. అదే మార్గంలో వెళ్తున్న ఓ గూడ్స్ వాహనానికి తాడు కట్టి ఎట్టకేలకు అంబులెన్స్ వేచి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఏ ప్రమాదం జరగకుండా ముస్మి గ్రామం చేరుకోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

మరో ఘటనలో.. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో నెలలు నిండిన ఓ గర్భిణీని ట్రాక్టర్‌లో కామారం నుండి కోమట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లిన ఘటన చూపరులను కలిచివేసింది. ఏజెన్సీలో నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను మన కండ్లకు కడుతున్నాయి. ఓట్ల కోసం తప్ప అభివృద్ధికి మేము గుర్తుకురామా? అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ఇప్పటికైనా గుర్తించాలని అధికారులను వేడుకుంటున్నారు.



Next Story

Most Viewed