ఏజెన్సీలో విజృంభించిన విషజ్వరాలు.. బెంబేలేత్తిస్తున్న హాస్పిటల్స్

by  |
ఏజెన్సీలో విజృంభించిన విషజ్వరాలు.. బెంబేలేత్తిస్తున్న హాస్పిటల్స్
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మణుగూరు మండలంలో విషజ్వరాల మోత రోజు రోజుకి మోగిపోతుంది. మండలంలో గిరిజనులు విషజ్వరాలతో మంచాలు పట్టి గోషిస్తున్నారు. గిరిజనులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. మండలంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రులు చూసిన హౌస్ ఫుల్ అయ్యాయి. ఆసుపత్రిలో బెడ్స్ దొరకగా ప్రజలు బయటే కూర్చొని కుంగిపోతున్నారు. ఏజెన్సీ నలుమూలల నుంచి వచ్చిన గిరిజనులు ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకోవాలంటే ఫీజులు భగ్గుమంటున్నయని గిరిజనులు వాపోతున్నారు.

ఫీజులు కట్టలేక తమ గుడిసెల్లో మంచాలు పట్టారు. డబ్బు ఉన్నవాడు ప్రైవేట్ ఆసుపత్రిలో ఏసీ కింద వైద్యం చేపించుకుంటున్నాడు, డబ్బు లేని గిరిజనులు గుడిసె కింద మూలుగుతూ నరకయాతన పడుతున్నారు. ఇది ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల బతుకులు. ప్రైవేట్ ఆసుపత్రులు దొరికిందే సందు అనుకోని ఇదే సీజన్‌ను ఆసరా చేసుకుని ఓపి ఫీజు 150 నుంచి 200 గుంజుతూ, మాతర్ గోళీలతో రెండు వేల రూపాయల వరకు పిండుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో గిరిజనులకు తినడానికి తిండే కరువైంది. ఇక ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే ఆసుపత్రిలో చూపించుకోవడానికి డబ్బులు లేకపాయ. ఏది ఏమైనా ఏజెన్సీలో గిరిజన బిడ్డల బ్రతుకులు చాలా దారుణంగా మారాయి. ప్రతి గుడిసెలో ఒక్కరు, ఇద్దరు విష జ్వరాలతో మంచాలు పట్టారు. ఆలనా పాలనా కరువై మంచి నీళ్ళు ఇచ్చే దిక్కేలేకపోయింది. ఇలా ఆసుపత్రిలో చూపించుకోలేక, డబ్బులు లేక గిరిజనులు అల్లాడుతూ మంచంలోనే కన్ను మూసే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు విష జ్వరాలపై ఎటువంటి చర్యలు చేపట్టడంలేదని గిరిజనులు వాపోతున్నారు.

గిరిజనులు రోగాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళితే డాక్టర్ చూసి చూడనట్లు ప్రవర్తిస్తున్నారని గిరిజనులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అటు ప్రభుత్వం పట్టించుకోకుండా, ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులతో దోచుకుంటూ ఏమి చేయలేని పరిస్థితి గిరిజనులకు ఏర్పడింది. చేసేది ఏమి లేక నాటు వైద్యం తీసుకుంటూ మంచాలలోనే గడుపుతున్నామని గిరిజనులు విలపించారు. ఎంతో మంది గిరిజనులకు వైద్యం అందక గుడిసె‌ల కిందనే ప్రాణాలు వదిలేశారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం విషజ్వరాలపై చర్యలు చేపట్టాలని, ప్రైవేట్ అసుపత్రుల ఫీజుల దోపిడీని అరికట్టాలని అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, మహిళ మండల సంఘాలు, విద్యార్థి సంఘాలు, గిరిజనులు కోరుతున్నారు.

Next Story

Most Viewed