VIRAL: రాపిడో డ్రైవర్‌గా మారిన తీన్మార్ మల్లన్న: సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-26 06:14:59  IST  )

తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న రాపిడో బైక్ నడిపారు.

VIRAL: రాపిడో డ్రైవర్‌గా మారిన తీన్మార్ మల్లన్న: సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ వినూత్న రీతిలో ప్రజల్లోకి వెళ్లారు. హైదరాబాద్ నగరంలో రాపిడో (Rapido) బైక్ టాక్సీలు నడుపుతూ జీవనం సాగిస్తున్న రైడర్ల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకునేందుకు శనివారం సాయంత్రం రోడ్డెక్కారు. స్వయంగా బైక్ నడుపుతూ రాపిడో డ్రైవర్‌గా మారారు. రాష్ట్రంలో రాపిడో డ్రైవర్లు ఎదుర్కొంటున్న అధిక కమిషన్ చార్జీలు, యాప్ కంపెనీల విధానాలు, ఆదాయ లోటు, రోజువారీ ఉపాధి సమస్యలను ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకునేందుకు ఆయన రాపిడో బైక్ నడిపినట్లుగా టీఆర్‌పీ వర్గాలు తెలిపారు.

శాసనమండలిలో గళం విప్పుతా..

ఆన్‌లైన్ ట్యాక్సీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటినీ రాబోయే శాసన మండలి (Legislative Council) సమావేశాల్లో బలంగా ప్రస్తావించి, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ పొందేలా పోరాడతానని ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న వెల్లడించారు. అయితే, సోషల్ మీడియాలో నిత్యం వార్తలు చదువుతూ కనిపించే తీన్మార్ మల్లన్న హెల్మెట్ పెట్టుకుని, బైక్ నడుపుతూ కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. డ్రైవర్ల హక్కుల కోసం ఆయన తీసుకున్న ప్రత్యేక చొరవపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story