VIRAL: మానవత్వమా సిగ్గుపడు..! పసి ప్రాణంపై మాజీ జవాన్ పైశాచికం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-06 02:13:24  IST  )

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. జామకాయలు కోసిందని ఓ చిన్నారిని గొలుసులతో బంధించి హింసించిన మాజీ ఆర్మీ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

VIRAL: మానవత్వమా సిగ్గుపడు..! పసి ప్రాణంపై మాజీ జవాన్ పైశాచికం
X

దిశ, వెబ్‌డెస్క్: మనుషుల్లో రోజురోజుకు మానవత్వం చచ్చిపోతోంది. తాము ఏం చేస్తున్నామనే విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ మానవ జాతికే మచ్చ తెస్తున్నారు. అచ్చం అలాంటి ఘటన తాజాగా హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని ఉనా (Una) జిల్లాలో వెలుగుచూసింది. కేవలం కొన్ని జామకాయలు దొంగిలించిందనే నెపంతో ఒక చిన్నారిపై ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఆ బాలికను కుక్కను కట్టేసినట్లు గొలుసులతో బంధించి, కర్రతో చితకబాదాడు. ఈ అమానుషానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికుల సమాచారం ప్రకారం.. ఓ మాజీ సైనిక ఉద్యోగి తమ తోటలో అభంశుభం తెలియని ఓ బాలిక జామకాయలు కోసిందన్న కోపంతో ఇంట్లోకి పట్టుకొచ్చాడు. శిక్షాస్మృతిని మరిచిపోయి, తనే న్యాయ నిర్ణేతలా వ్యవహరించాడు. బాలిక రెండు చేతులను, కాళ్లను గొలుసులతో కలిపి తాళం వేశాడు. భయంతో వణికిపోతున్న ఆ చిన్నారిని కనికరించకుండా కర్రతో పదే పదే కొట్టాడు. నిందితుడు చేస్తున్న ఈ పైశాచికాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో ఆ బాలిక గొలుసులతో బంధించబడి ఉండటం, నిందితుడు ఆమెను బెదిరిస్తూ కొడుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఒక మాజీ సైనికుడివై ఉండి ఇలాగేనా ప్రవర్తించేది?’ అంటూ నిందితుడిపై విరుచుకుపడుతున్నారు. అయితే, ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉనా పోలీసులు తక్షణమే స్పందించారు. వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి, అతనిపై బాలల హక్కుల పరిరక్షణ చట్టం (JJ Act), ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు ధృవీకరించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు.

Next Story