VIRAL: పిండం ముట్టక యమ తిప్పలు.. ‘బలగం’ మూవీ సీన్ రిపీట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-20 02:32:55  IST  )

‘బలగం’ మూవీలోని సీన్ రిపీట్ అయింది. పురాణపూల్ శ్మశానవాటికలో పిండం ముట్టేందుకు కాకి రాకపోవడంతో కుటుంబ సభ్యుల యమ తిప్పలు పడ్డారు.

VIRAL: పిండం ముట్టక యమ తిప్పలు.. ‘బలగం’ మూవీ సీన్ రిపీట్
X

దిశ, వెబ్‌డెస్క్: అసలే ఎండాకాలం కావడంతో మానవమాత్రులు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు మారుతున్న అలవాట్లు, జీవనశైలిలో మార్పుల కారణంగా ప్రకృతిలో జీవులు కూడా కంటికి కనిపించడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని పురాణపూల్ శ్మశానవాటికలో చోటుచేసుకున్న ఓ ఘటన చూస్తుంటే.. భవిష్యత్తులో మనం పక్షులను కేవలం పుస్తకాల్లోనే చూడాల్సి వస్తుందేమో అన్న భయం కలగక మానదు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఒక వ్యక్తి మరణించగా, సదరు కుటుంబ సభ్యులు ఆయన ఆత్మ శాంతించాలన్న ఆరాటంతో పిండ ప్రదానం చేశారు. ఇక కాకి వచ్చి పిండాన్ని ముట్టడమే మిగిలి ఉంది. కానీ నిమిషాలు, గంటలు గడిచినా.. సూర్యుడు నడినెత్తికి వచ్చినా.. ఒక్క కాకి కూడా పిండం వైపు కన్నెత్తి చూడలేదు. "పితృదేవతలు అంగీకరించలేదా.. లేక ఏవైనా తప్పులు జరిగాయా..?" అన్న ఆందోళన ఆ కుటుంబంలో మొదలైంది.

ప్రాణం పోయినా.. పంతం వీడక..

శాస్త్రం మీద నమ్మకంతో వారంతా అక్కడే ఎటూ వెళ్లకుండా కాకి కోసం కళ్లార్పకుండా వేచి చూశారు. గంటలు గడుస్తున్నా కాకులు రాకపోవడంతో బేజారెత్తిపోయిన వారు ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. వెంటనే పాతబస్తీలోని పక్షుల సంత ‘ముర్గీ చౌక్’కు వెళ్లారు. అక్కడ వెతికి వెతికి ఒక కాకిని కొనుగోలు చేశారు. పంజరంలో బంధించిన ఆ కాకిని తెచ్చి పిండం ముందు వదిలారు. ఆ పక్షి పిండాన్ని తాకగానే, ఆ కుటుంబం గుండెల మీద నుంచి ఒక పెద్ద బరువు దిగినట్లయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ‘బలగం’ మూవీ సీన్ గుర్తుకొచ్చిందని కామెంట్ చేస్తున్నారు.

Next Story