రోగికి కుట్లేసిన పారిశుద్ధ్య కార్మికురాలు.. ప్రభుత్వాస్పత్రిలో తేటతెల్లమైన వైద్యుల నిర్లక్ష్యం

by Naga Rani Yarlagadda |

ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగికి.. పారిశుద్ధ్య కార్మికురాలు వైద్యం చేసిన ఘటన వైరల్ గా మారింది.

రోగికి కుట్లేసిన పారిశుద్ధ్య కార్మికురాలు.. ప్రభుత్వాస్పత్రిలో తేటతెల్లమైన వైద్యుల నిర్లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనేందుకు ఈ ఘటన మరో ఉదాహరణగా మారింది. ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగికి.. పారిశుద్ధ్య కార్మికురాలు వైద్యం చేసిన ఘటన వైరల్ గా మారింది. తమిళనాడులోని రాణిపేట జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన వెలుగుచూసింది. రాణిపేటలోని కలవాయికి చెందిన రాజేంద్రన్ శనివారం (జనవరి 3) సాయంత్రం టూవీలర్ ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఫ్రెండ్స్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు విధుల్లో ఉన్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న కలైసెల్వి అనే మహిళ.. రాజేంద్రన్ కు అయిన గాయాలకు డ్రెస్సింగ్ చేసి కుట్లు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

ఈ వీడియోపై వైద్య సేవల జాయింట్ డైరెక్టర్ తీర్థలింగం స్పందించారు. వీడియోలో కనిపిస్తున్న ఆస్పత్రి రాణిపేట ప్రభుత్వ ఆస్పత్రేనని నిర్థారించారు. రోగికి ఒక పారిశుద్ధ్య కార్మికురాలు వైద్య చికిత్స చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. కానీ.. ఆస్పత్రిలో సిబ్బంది కొరత, రోగులకు చికిత్స చేయడంపై ఆమెకు ఉన్న వ్యక్తిగత ఆసక్తి కారణంగా కలైసెల్వి ఈ పనిని చేపట్టినట్లు తీర్థలింగం తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వైద్యుడు, నర్సులను ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని, ఎవరైనా దోషులుగా తేలితే చర్యలు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని నెటిజన్లు అంటున్నారు.

Next Story