వినియోగదారులకు తీపికబురు.. దేశంలోనే తొలి ‘LPG గ్యాస్ ATM’ షురూ

by Kema Shiva Kumar |

దేశంలోనే ఎల్పీజీ కొరతపై చర్చ కొనసాగుతోన్న వేళ తొలి ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం అట్టహాసంగా ప్రారంభమైంది.

వినియోగదారులకు తీపికబురు.. దేశంలోనే తొలి ‘LPG గ్యాస్ ATM’ షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తీపికబురు చెప్పింది. సిలిండర్ బుక్ చేసి రోజుల తరబడి వేచి చూసే అవసరమే లేకుండా, ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినంత సులభంగా ఇకపై గ్యాస్ సిలిండర్లను పొందే సదుపాయాన్ని కల్పంచారు. ఈ మేరక నార్త్ ఇండియాలో మొదటి ‘ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం’ (LPG Gas ATM) హర్యానాలోని గురుగ్రామ్‌లో ప్రారంభమైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా గురుగ్రామ్‌లో సోహ్నా, సెక్టార్ 33లోని ‘సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీ’లో ఈ స్మార్ట్ వెండింగ్ మిషన్‌ను ఏర్పాటు చేసింది.

ప్రధాన ప్రయోజనాలు ఇవే..

అయితే, ఈ ‘ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం’ మిషన్ రోజులో 24 గంటలూ పనిచేస్తుంది. డెలివరీ బాయ్ ఎప్పుడు వస్తాడా అని వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం రెండు నుంచి మూడు నిమిషాల వ్యవధిలోనే ఖాళీ సిలిండర్ ఇచ్చి నిండు సిలిండర్‌ను పొందవచ్చు ఈ ఏటీఎం ద్వారా ‘కాంపోజిట్ సిలిండర్లను’ (Composite Cylinders) అందిస్తున్నారు. ఇవి సాధారణ ఇనుప సిలిండర్ల 31 కేజీలు కంటే అందులో సగం బరువు అంటే సుమారు 15 కేజీలు మాత్రమే ఉంటాయి. ఈ సిలిండర్లు పారదర్శకంగా ఉండటం వల్ల లోపల గ్యాస్ ఎంత ఉందో వినియోగదారులు నేరుగా చూసుకోవచ్చు.

సిలిండర్ ఇలా ఎలా తీసుకోవాలంటే..

ముందుగా ‘ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం’ మిషన్ వద్ద వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం మొబైల్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఖాళీ సిలిండర్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ (UPI) లేదా డెబిట్ కార్డ్ ద్వారా డిజిటల్ పేమెంట్ పూర్తి చేయాలి. పేమెంట్ పూర్తయిన వెంటనే మిషన్ నుంచి నిండు సిలిండర్ బయటకు వస్తుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత దృష్ట్యా వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో ఈ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నారు.

Next Story