ఒక్క విద్యార్థి కోసం ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు.. తీరా చూస్తే పరీక్షకు డుమ్మా

by Kema Shiva Kumar |

నాగర్‌కర్నూలులో వింత ఘటన చోటచేసుకుంది. ఒక్క విద్యార్థి కోసం అధికారులు ఏకంగా పరీక్షా కేంద్రాన్నే ఏర్పాటు చేశారు.

ఒక్క విద్యార్థి కోసం ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు.. తీరా చూస్తే పరీక్షకు డుమ్మా
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పరీక్షా కేంద్రం అంటే వందలాది మంది విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, పోలీస్ బందోబస్తుతో సందడిగా ఉంటుంది. కానీ, నాగర్‌కర్నూలు (Nagar Kurnool) జిల్లా కేంద్రంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. కేవలం ఒక్కే ఒక్క విద్యార్థి కోసం అధికారులు ఏకంగా ఒక పరీక్షా కేంద్రాన్నే సిద్ధం చేశారు. తీరా పరీక్ష సమయానికి ఆ విద్యార్థి డమ్మా కొట్టడంతో అధికారులు అవాక్కయ్యారు.

అసలేం జరిగిందంటే?

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బ్రిడ్జి కోర్స్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష రాసేందుకు కమ్మరి వరుణ్ సందేశ్ (Varun Sandesh) అనే విద్యార్థి ఒక్కడే దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం.. దరఖాస్తు చేసుకున్నది ఒక్క విద్యార్థి అయినా సరే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధన. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణ కోసం ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఒక ఇన్విజిలేటర్‌తో పాటు ఇతర సిబ్బందిని నియమించారు. నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

చివరకు ఏమైందంటే..

పరీక్ష సమయం ఆసన్నమై ప్రశ్నపత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అధికారులు తమ విధుల్లో అప్రమత్తంగా ఉన్నారు. కానీ, ఎవరి కోసం అయితే ఇన్ని ఏర్పాట్లు చేశారో.. ఆ విద్యార్థి వరుణ్ సందేశ్ మాత్రం పరీక్షా కేంద్రానికి రాలేదు. గంటల తరబడి వేచి చూసిన అధికారులు, చివరకు ఆ విద్యార్థి గైర్హాజరైనట్లు (Absent) నిర్ధారించి అక్కడికి వెనుదిరిగారు. ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం ఇంత భారీగా ఏర్పాట్లు చేయడం.. తీరా ఆ విద్యార్థి పరీక్షకు కూడా హాజరుకాకపోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story