కండక్టర్ నుంచి లంచం డిమాండ్.. నడిరోడ్డుపై బస్సు చెకింగ్ అధికారిపై దాడి

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-01 06:12:07  IST  )

నారాయణఖేడ్ డిపో బస్సులో తనిఖీ చేపట్టిన అధికారి లంచం డిమాండ్ చేయడంతో ప్రయాణికులు, కండక్టర్ ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు.

కండక్టర్ నుంచి లంచం డిమాండ్.. నడిరోడ్డుపై బస్సు చెకింగ్ అధికారిపై దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: నారాయణఖేడ్ (Narayankhed) డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చెకింగ్ అధికారి అవినీతికి పాల్పడటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టికెట్ లేని ప్రయాణికుడి నుంచి జరిమానా వసూలు చేయాల్సింది పోయి, కండక్టర్‌ను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు అధికారి డబ్బులు డిమాండ్ చేయడంతో గొడవ మొదలైంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ (Hyderabad) నుంచి రాయికోడ్ (Raikode) మీదుగా నారాయణఖేడ్ వెళుతున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ బస్టాండ్ వద్ద చెకింగ్ అధికారి ప్రకాష్ తనిఖీ చేశారు. అయితే, చెకింగ్‌లో భాగంగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని గుర్తించిన ప్రకాష్, సదరు ప్రయాణికుడికి జరిమానా వేయడంతో పాటు, కండక్టర్‌పై ఛార్జ్ మెమో ఇవ్వకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశారు.

తిరగబడిన ప్రయాణికులు..

ఇది తంతంగమంతా గమనించిన ప్రయాణికులు అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ (Police Station) సమీపంలోనే చెకింగ్ అధికారి వాహనాన్ని అడ్డుకుని నిలదీశారు. పంచాయితీ కాస్తా ముదరడంతో ఆగ్రహం తట్టుకోలేక కండక్టర్చ, ప్రయాణికులు కలిసి చెకింగ్ అధికారి ప్రకాశ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామంతో రాయికోడ్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారి ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కండక్టర్‌తో పాటు ప్రయాణికులు కూడా సిద్ధమయ్యారు.

Next Story