లక్ష చీరలతో గణనాథుడి ప్రతిమ ఏర్పాటు.. ఎక్కడంటే?

by Yella Dhawani Reddy |

గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈనెల 27వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి.

లక్ష చీరలతో గణనాథుడి ప్రతిమ ఏర్పాటు.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈనెల 27వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే గల్లీ గల్లీలో వినాయక చవితి (Ganesha Chavithi) సందడి మొదలైంది. మరోవైపు అందంగా అలంరించిన మండపాలలో కొలువుదీరడానికి వివిధ రూపాల్లో వినాయకుడి ప్రతిమలు సైతంగా సిద్ధమయ్యాయి. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా విశాఖపట్నంలో (Vishakapatnam) వెరైటీగా గణనాథుడిని ప్రతిష్టిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక (Gajuwaka) వినూత్నమైన వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయటంతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అంతేకాదు ఇప్పటివరకు ఎత్తైన 117 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించిన రికార్డు సైతం సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఈసారి వెరైటీగా చీరలతో గణనాథుడిని ఏర్పాటు చేయనున్నారు. 'శ్రీ సుందర వస్త్ర మహా గణేశ' పేరుతో లంక గ్రౌండ్‌లో 90 అడుగుల భారీ వినాయకుడు రెడీ చేస్తున్నారు. ఇందుకోసం ముంబై, చెన్నై, సూరత్‌ సహా పలు నగరాల నుంచి సేకరించిన చీరలతో మహా గణపతిని నిర్వాహకులు అందంగా ముస్తాబుచేస్తున్నారు. తొలుత రెండు, మూడు రకాల ఆహార పదార్థాలతో గణేషుడ్ని తయారు చేయాలని భావించారు. అయితే, ఎక్కువ రోజులు ఉండవని భావించి చీరలతో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే టన్ను పసుపు, టన్ను కుంకుమ, టన్ను విభూతి, టన్ను పువ్వులతో స్వామి అభిషేకానికి ఉపయోగించనున్నారు. నిమజ్జనానికి 5 టన్నుల లడ్డూను ఉపయోగించనున్నారు.

వినాయకుడి తయారీకి ఉపయోగించిన చీరలను నిమజ్జనం అనంతరం భక్తులకు పంచిపెట్టనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే.. దేశంలో చీరలతో గణేష్ విగ్రహాన్ని తయారు చేయడం ఇదే మొదటిసారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది గాజువాకకు గర్వకారణం మాత్రమే కాదని, పర్యావరణ అనుకూల వేడుకల వైపు ఓ అడుగు పడుతుందని అంటున్నారు.

Next Story