గోవిందుడి గుడికి చేరుతున్న రూ.2 వేల నోట్ల కట్టలు.. షాక్‌లో ఆలయ సిబ్బంది

by Disha Web Desk 7 |
గోవిందుడి గుడికి చేరుతున్న రూ.2 వేల నోట్ల కట్టలు.. షాక్‌లో ఆలయ సిబ్బంది
X

దిశ, వెబ్‌డెస్క్: రూ. 2 వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకున్నది మొదలు.. బీరువాల్లో దాచిన నోట్లను ఒక్కోక్కటిగా బయటికి తీస్తున్నారు ప్రజలు. ఈ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది ఆర్‌బీఐ. వీటిని మార్చడానికి అనేక దారులు వెతుక్కుంటున్నారు. అయితే కొంత మంది భక్తులు మాత్రం నోట్ల రద్దు విషయంలో కూడా దేవుడే దిక్కు అంటున్నారు. తమ దగ్గర ఉన్న రూ. 2 వేల నోట్లను దేవుడి హుండీలో వేసి చేతులు దులుపుకుంటున్నారు. రూ. 2 వేల నోట్లు మార్చుకునే భారాన్ని దేవునికి వదిలేస్తున్నారు. అంటే దేవుడికి ఇస్తే మళ్ళీతిరిగి తమకి ఇస్తాడన్న పిచ్చి నమ్మకమో ఏమో మరి.. తమ దగ్గర ఉన్న రూ. 2 వేల నోట్ల కట్టలను స్వామికి సమర్పించుకుంటున్నారు.

తాజాగా ద్వారకా తిరుమల చిన వెంకన్న హుండీలో పెద్ద మొత్తంలో రూ. 2 వేల నోట్లు ప్రత్యక్షమవుతున్నాయి. హుండీ లెక్కింపులో పెద్ద మొత్తంలో రెండు వేల నోట్లను చూసిన సిబ్బంది షాకయ్యారు. ఓపిక లేకా? లేదా అతితెలివా? లేక తప్పించుకోడానికో మొత్తానికి స్వామి ఖాతాలో జమ చేస్తున్నారు భక్తులు. రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయంతో.. భక్తులంతా రూ. 2 వేల నోట్లను హుండీల్లో వేస్తున్నారని చెబుతున్నారు ఆలయ సిబ్బంది. బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకునేందుకు వీలుపడక స్వామికి కానుకగా వేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుంది. ఉపసంహరించుకున్న 15 రోజుల్లో 3,288 రెండు వేల నోట్లను ఇప్పటివరకు హుండీలో వేశారు భక్తులు. వీటి విలువ రూ. 7.76 లక్షలుగా ఉంది. రెండు వేల నోట్ల ఉపసంహరణకు ముందు ఎప్పుడు హుండీ లెక్కించినా 2 వేల నోట్లు 408 మించేవి కావని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అలాగే భక్తులు 2 వేల నోట్లతో ప్రసాదాలు కొని, మొక్కులు చెల్లించుకుంటున్నారని చెబుతున్నారు ఆలయ సిబ్బంది.


Next Story

Most Viewed