దుబ్బాక ఎన్నికల ఎఫెక్ట్.. కలెక్టర్ బదిలీ

by  |
దుబ్బాక ఎన్నికల ఎఫెక్ట్.. కలెక్టర్ బదిలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : మరో వారం రోజుల్లోల దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. పూర్తి అదనపు బాధ్యతలతో మెదక్ జిల్లా కలెక్టర్‌గా కూడా ఆయనను తప్పించింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకం అని భావిస్తున్న తరుణంలో ఆయనను ప్రభుత్వం బదిలీ చేయడం వెనక బలమైన కారణమే ఉందన్న ఊహాగానాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో టీఆర్ఎస్ అభ్యర్థి అనే వార్తలు వచ్చిన సమయంలో ఆయనను కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకుని మరీ బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

వెంకట్రామిరెడ్డి స్థానంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొళికేరిని నియమిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న హనుమంతరావును మెదక్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పటికీ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతల నుంచి కూడా హోళికేరి భారతి తప్పుకోవడంతో ఆ జిల్లా బాధ్యతలను కరీంనగర్ జిల్లా శశాంకకు అప్పగించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న షిక్తా పట్నాయక్ మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలతో వ్యవహరించనున్నారు.

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్న సత్యనారాయణ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన సోదరుడైన సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని తప్పించడం గమనార్హం. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అపవాదును మూటగట్టుకున్న వెంకట్రామిరెడ్డి ఇప్పుడు హఠాత్తుగా బదిలీ కావడం వెనక బలమైన కారణాలే ఉన్నాయన్న చర్చలు జోరుగానే సాగుతున్నాయి. కలెక్టర్‌గా ఉండి కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణంలో జాప్యం, పలు అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన సాగుతుండడం, ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీకి అవి ప్రతికూల అంశాలుగా మారాయన్న కారణంతో తప్పించి ఉండవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.


Next Story