ప్రేమ, సేవ అందరికీ అందాలి : ట్రైనీ ఐఏఎస్‌లు

by  |
Trainee IAS
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థలో మూడు నెలల శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్న అఖిల భారతీయ సర్వీసులకు చెందిన అధికారుల బృంద సభ్యులు ఆదివారం ఔదార్యాన్ని చాటారు. ప్రేమ, సేవ అందరికీ అందాలనే లక్ష్యంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫౌండేషన్ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సోషల్ సర్వీసెస్ క్లబ్ సభ్యులు, కార్యదర్శి అనుపమ్ శర్మ, మరో ఐదుగురు సభ్యుల నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పేద రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా భోజనాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ సోషల్ సర్వీసెస్ క్లబ్ కార్యదర్శి అనుపమ్ శర్మ మాట్లాడుతూ వాలైంటెన్ డే సందర్భంగా ప్రపంచమంతా నేడు ప్రేమ, సేవా భావంపై చర్చించుకుంటోందని, అయితే ఈ ప్రేమ, సేవలు అందరికీ అందేలా చూడడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం ఇండియన్ ఫారెస్టు సర్వీసెస్‌లో శిక్షణ పొందుతున్న అధికారి శ్వేత మాట్లాడుతూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్‌లో ఎందరో పేదలు సుదీర్ఘ కాలం చికిత్స పొందుతున్నారని, కొవిడ్, ఇతర కారణాలతో భోజన సదుపాయాలు కష్టమైన వేళ ఒక్క రోజైనా వారికి సాయం చేయాలనే లక్ష్యంతో తాము ఈ పని చేసినట్లు వివరించారు. అలాగే ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వద్ద సుమారు 100 మంది రోగులు, వారి కుటుంబ సభ్యులకు భోజనాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ అనుపమ్ శర్మ, ఐపీటీఏఎఫ్ఎస్‌లు సంధ్య సమీర, తన్వికా సింగ్, రశ్మి ఆర్‌డీ, జోసెఫ్, ఐఎఫ్ఎస్‌లు సుమన్ బేనివాల్, శ్వేత బొడ్డు, కార్తికేయని, ఐపీఎస్ శైలేంద్ర బమానియా, ఐసీఎల్ఎస్ రోనక్ అగర్వాల్, పూర్ణవ గంగూళి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed