సిరిసిల్లలో విషాదం.. కల్తీ మద్యం సేవించి వ్యక్తి మృతి..?

by  |
Sircilla, Man died
X

దిశ, సిరిసిల్ల: మద్యం సేవించి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందగా, మరొకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని కార్తికేయ వైన్సులో మద్యం కొనుగోలు చేసి, ఆ షాపు పర్మిట్ రూంలో సేవించాడు. అనంతరం కొద్దిసేపటికే శ్రీనివాస్ కుప్పకూలిపోయాడు.

మద్యం అతిగా సేవించడం వల్ల స్పృహ కోల్పోయాడని భావించిన మద్యం షాపు యజమాని శ్రీనివాస్‌ను షాపు ఎదుట పడుకోబెట్టాడు. మరి కొద్దిసేపటికి అదే వైన్సులో మద్యం సేవించిన సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్‌కు చెందిన రాపెల్లి సంజీవ్ అనే మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. గమనించిన స్థానికులు అంబులెన్సుకు సమాచారం అందించారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా శ్రీనివాస్ అప్పటికే మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న సంజీవ్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న మృతుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, బంధువులు వైన్ షాపు వద్దకు చేరుకొని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. సృహ కోల్పోయిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా బయట పడేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం వల్లే శ్రీనివాస్ మృతిచెందాడని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసు, ఎక్సైజ్ అధికారులు శ్రీనివాస్ మృతిపై విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న సిరిసిల్ల పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Next Story