చెప్పలేక.. లోలోపల మథనపడుతూ..

by  |
చెప్పలేక.. లోలోపల మథనపడుతూ..
X

దిశ, రంగారెడ్డి: కొవిడ్ -19తో అతలాకుతలం అవుతున్న సమయంలో వ్యాపారులు ప్రజలను దోచుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేని సమయంలో అండగా ఉండాల్సిన వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో అధిక ధరలకు విక్రయించిన, కల్తీకి పాల్పడిన వారిపై పీడీ యాక్ట్, కఠిన చర్యలు, సీజ్ చేస్తామని సీఎం కేసీఆర్ బహిరంగంగానే హెచ్చరించారు. అంతేకాకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కానీ, ఈ పనిని ఏ ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి కూడా చేయడంలేదు. ఫిర్యాదు చేసినా ఫలితం లేదని గమనించిన ప్రజలు చెప్పలేక లోలోపల మథన పడుతున్నారు.

అసలు విషయమేమిటంటే..

ప్రతిరోజూ ప్రతి కుటుంబానికి పప్పు, ఉప్పు, కారం, నూనె, చక్కెర, అల్లం వెల్లుల్లి, చింతపండును ఇళ్లలో వినియోగిస్తారు. ఇలాంటి సరుకులు ప్రస్తుతం సామాన్యుడికి అందుబాటు ధరలో లేవు. ఉదాహరణకు కంది పప్పు కిలో రూ. 90లు అయితే రూ.100కు, చక్కెర కిలో రూ. 40 లు అయితే రూ.45 లకు, గోధుమ పిండి రూ.39లు అయితే రూ. 48లకు, చింతపండు కిలో రూ.150 ఉంటే రూ.200లకు, ఎండుమిర్చి కిలో రూ.120 నుంచి రూ.220కి పెంచి విక్రయిస్తున్నారు. ఈ వస్తువుల ధరల వివరాలను అడిగి తెలుసుకుంటే పెంపు లేదని చెబుతున్నారు. కానీ, వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

వాటిని కూడా…

రైతు వద్ద టమాట కిలో 1.50 పైసలకు కొనుగోలు చేసుకొని రూ.5 నుంచి 7లకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా ప్రతి కూరగాయల మార్కెట్లో అదనంగా రూ.5 నుంచి రూ.10లకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు వారం వారం సంతలో తీసుకునే కూరగాయలను వారం తప్పి మరోవారం తెచ్చుకుంటున్నారు. అది కూడా అవసరమైన 3 రకాల కూరగాయలను మాత్రమే తెచ్చుకుంటున్నారు. పండ్లు కూడా అదేవిదంగా విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మామిడి, బత్తాయి పండ్లు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. దీంతో వ్యాపారులు రైతుల వద్ద మామిడి, బత్తాయి కిలోకి సుమారుగా రూ.30 నుంచి రూ.40లకు తీసుకొని వినియోగదారులకు రూ.80 నుంచి 110 వరకు విక్రయిస్తున్నారు.

మాంసం ధరలైతే ఘోరం…

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి పెంపునకు మాంసాహారం తీసుకోవాలని ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మాంసం వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచేశారు. సామాన్యుడిని మాంసం కొనుగోలుకు దూరం చేశారు. కిలో చికెన్ ను న్యూస్ పేపర్లో ప్రకటించిన ధరకు విక్రయిస్తున్నప్పటికి గ్రామీణ ప్రాంతంలో అదనంగా రూ10లకు, అదే మటన్ రూ.700లకు పైగా, చేపలు రూ.30 నుంచి రూ.40లకు తీసుకొచ్చి రూ.180లకు కిలో అమ్ముతున్నారు. చాలా దారుణంగా విక్రయాలు చేస్తున్నారు. అదేవిధంగా కరోనాతో ఖాళీ సమయం కలిసొచ్చిన వారు ఇండ్లు నిర్మిస్తున్నారు. వ్యాపారులు ఎమ్మార్పీ కంటే దాదాపు రెండింతలకు పెంచి సిమెంట్ బస్తాలను అమ్ముతున్నారు. ప్రస్తుతం సిమెంట్ సరఫరాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా వ్యాపారులు అలాగే వ్యవహరిస్తున్నారు. కంకర, ఇసుక, ఇటుక, రాయి ధరలు ఆకాశాన్ని చేరుతున్నాయి.

ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం…

ఈ ధరల నియంత్రణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని గ్రామ పంచాయతీలు ధరల నియంత్రణకు తీర్మానాలు చేస్తున్నాయి. అది కూడా స్థానికంగా ఉండే సర్పంచులే. అధిక గ్రామ పంచాయతీ సర్పంచులు పట్నంలో స్థిరపడిన వారు ఈ సమస్యను గాలికి వదిలేశారు.

Tags: Rangareddy, Vegetables, Essential Goods, High Prices, Merchants, CM KCR, Officers & Representatives



Next Story

Most Viewed