వాగులో చిక్కిన ట్రాక్టర్.. రైతును కాపాడిన స్థానికులు

by  |
వాగులో చిక్కిన ట్రాక్టర్.. రైతును కాపాడిన స్థానికులు
X

దిశ,పాలేరు: నియోజకవర్గంలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగులు పొంగడంతో కూసుమంచి మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన మర్రి నర్శిరెడ్డి అనే రైతు చౌటపల్లి-బిరోలు గ్రామాల మధ్య ఉన్న వాగులో చిక్కుకుపోయాడు. అతను ట్రాక్టర్ ద్వారా వాగు దాటే క్రమంలో ప్రవాహ ఉధృతికి ట్రాక్టర్ ఆగిపోయింది. దీనితో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తాళ్ళ ద్వారా ఒడ్డుకు చేర్చారు. ఉదయం పొలానికి వెళ్లి ట్రాక్టర్ ద్వారా పశువులకు గడ్డి తెచ్చే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కూసుమంచి ఎస్సై నందీప్, తహసీల్దార్ శిరీష వాగులో చిక్కుకుపోయిన ట్రాక్టర్ ని బయటకు తీయిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సై నదీప్ మాట్లాడుతూ.. మండల ప్రజలు ప్రమాద భరితంగా ప్రవహిస్తున్న వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. మండలంలో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించినట్లు వెల్లడించారు.


Next Story

Most Viewed