‘మూడు నెలల పూర్తి జీతం ఇవ్వాల్సిందే’

by  |
‘మూడు నెలల పూర్తి జీతం ఇవ్వాల్సిందే’
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రభుత్వ ఉపాధ్యాయులకు మార్చి – మే నెలలకు సంబంధించిన జీతాలు చెల్లించాలని టీపీటీఎఫ్ డిమాండ్ చేసింది. టీపీటీఎఫ్ ఏడో ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల రవీందర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ ఆశయాల సాధన కోసం అయితే తెలంగాణ ఏర్పడిందో, ఆ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో విద్యా రంగం పూర్తిగా నష్ట పోయే విధంగా ప్రభుత్వ విధానాలు అమలు అవుతున్నాయని ఆరోపించారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకుండా, ప్రభుత్వ పాఠశాలలు మూతపడే విధంగా ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తుందని విమర్శించారు. సగటు ఉపాధ్యాయున్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేసే విధంగా ప్రభుత్వం ఏకపక్షంగా మూడు నెలలుగా జీతం సగమే చెల్లిస్తూ ఉపాధ్యాయులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తోందన్నారు. కరోన సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికినీ, ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు మార్చి ,ఏప్రిల్, మే నెల జీతాలు 50 శాతం మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా వెంటనే పూర్తి జీతాన్ని విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించాలని కోరారు.

Next Story

Most Viewed