‘ఆడబిడ్డలను రోడ్డున పడేసిన కేసీఆర్’

by  |
‘ఆడబిడ్డలను రోడ్డున పడేసిన కేసీఆర్’
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వంటి కష్టకాలంలో సేవలందించిన స్టాఫ్​నర్సులను విధుల్లో నుంచి ఎలా తొలిగిస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ​గీతారెడ్డి ప్రశ్నించారు. ఏండ్ల నుంచి పని చేయించుకొని ఆడబిడ్డలను ఒకేసారి రోడ్డున పడేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో 48 గంటల నిరాహార దీక్ష శుక్రవారం మొదలైంది. ఇటీవల తొలిగించిన 1640 మంది స్టాఫ్​ నర్సులను విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా స్టాఫ్​ నర్సులు తమ సమస్యలను చెప్పుకుంటూ కన్నీరు కార్చారు. తమను రోడ్డున పడేశారంటూ, అన్యాయంగా విధుల్లో నుంచి తొలిగించారంటూ రోధించారు.

ఈ సందర్భంగా గీతారెడ్డి వారికి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ​ఆధ్వర్యంలో పోరాటం చేస్తామంటూ భరోసా ఇచ్చారు. అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో నర్సులు చేసిన సేవలు మరువలేనివని, వైద్యులు దేవుళ్లతో సమానం అంటూ చెప్పిన కేసీఆర్.. ఇంత సేవలు చేసిన నర్సులు దేవతలు కాదా అంటూ ప్రశ్నించారు. నిజామాబాద్‌లో తన కూతురు ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని, రాష్ట్రానికి తండ్రి వంటి కేసీఆర్ ​ఈ ఆడబిడ్డలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో కోర్టులో కేసు కూడా వేశామని, ప్రభుత్వంతో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి పోరాటం చేస్తారని గీతారెడ్డి చెప్పారు. ఈ స్టాఫ్​ నర్సుల అంశంలో ఒక కోర్​ కమిటీని వేసుకుంటామని, నర్సులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు. అదే విధంగా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ​మాట్లాడుతూ.. పది రోజుల్లో నర్సులను విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే అధికార పార్టీ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్‌లో డిమాండ్​ ఉన్నా నర్సులు ప్రభుత్వ దవాఖానాల్లో పని చేశారని, రూ. 22 వేల వేతనం ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.



Next Story

Most Viewed