‘ఆ సొమ్ముతో ఓట్లు కొనేందుకు టీఆర్ఎస్ ప్లాన్’

by  |
Uttam Kumar Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతి సొమ్ముతో ఓట్లు కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆదివారం కాంగ్రెస్​మండలి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందుకు నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్​ఉమ్మడి జిల్లాల నేతలు, డీసీసీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్​అనుబంధ సంఘాల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుంటే.. మాటల గారడీతో టీఆర్‌ఎస్​పాలన సాగిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్యెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అవినీతి సొమ్ముతో ఓట్లను కొనాలని చూస్తారన్నారు ఆరోపించారు. అయోధ్య రాముని ఆలయాన్ని నిర్మాస్తామంటున్న బీజేపీ.. భద్రాద్రి రాముడి ఆలయ అభివృద్ధికి ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.09 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ నివేదికలోనే వెల్లడించారని, వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎద్దేవా చేశారు. పీఆర్సీ నివేదిక ఉద్యోగులను కించపరిచేలా ఉందని విమర్శించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన బయ్యారం స్టీల్ పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ వంటి అంశాల్లో బీజేపీ మోసం చేసిందన్నారు. వచ్చే మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటర్లు బుద్ధి చెప్పాలన్నారు. సామాజిక న్యాయం ప్రాతిపదికగా రాములు నాయక్‌కు టికెట్​ఇచ్చామన్నారు.

ఫ్రెండ్లీ గవర్నమెంట్​అంటూ మోసం : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

రాష్ట్రంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్​అంటూ ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. నేటికీ పీఆర్సీ ప్రకటించలేదని విమర్శించారు. మధ్యంతర భృతి సైతం ఇవ్వలేదన్నారు. బిశ్వాల్​కమిటీ 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను ఏ విధంగా ప్రతిపాదించిందని ప్రశ్నించారు. గతంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాలతో పోరాడి హక్కులు, డిమాండ్లు సాధించుకునేవని, కానీ ఇప్పుడు ఎందుకు సన్నగిల్లుతున్నాయన్నారు. 45 శాతం ఫిట్‌మెంట్​ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు లేదన్నారు. మండలి ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్​నేతలు వి హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, అంజన్ కుమార్, యూత్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్, ప్రసాద్ కుమార్, నిరంజన్, మల్ రెడ్డి రంగారెడ్డి, వినోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులు కేసీఆర్‌‌‌పై యుద్ధం ప్రకటించాలి : భట్టి విక్రమార్క

బాల్కొండ నియోజకవర్గం నాగాపురం‌లో ఆదివారం భట్టి విక్రమార్క ‘రైతులతో ముఖాముఖి’ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేసీఆర్ నియంతలా పాలన చేస్తున్నందునే మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం తెచ్చుకున్నా అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. రాష్ట్రం ఏమైనా పరవాలేదు.. తన కుటుంబం బాగుంటే చాలన్నట్టుగా పాలన ఉందన్నారు. కేసీఆర్ పోలీసు భద్రత దాటుకుని, గ్రామాల్లోకి వచ్చి చూస్తే రైతుల బాధలు తెలుస్తాయన్నారు. రైతులు కన్నీళ్లు పెడుతున్నా కేసీఆర్ ఫాంహౌస్ దాటి బయటకు రావడం లేదన్నారు. పసుపు రైతులకు కూలీ ఖర్చులూ మిగలడం లేదన్నారు.



Next Story