టీపీసీసీ చీఫ్​ బీసీలకు ఇవ్వాలి: వీహెచ్​

by  |
టీపీసీసీ చీఫ్​ బీసీలకు ఇవ్వాలి: వీహెచ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీకి త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ప్రత్యామ్నాయం కాంగ్రెస్​ పార్టీ మాత్రమేనని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీ.హనుమంతరావు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అయితే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవీని బీసీలకు ఇవ్వాలని, బీసీలకు అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటుందని, కేడర్ అంతా కలసి పనిచేస్తారని చెప్పారు. ఈ విషయంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశానని, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్, హైకమాండ్‌కు రాష్ట్రంలో పరిస్థితులు వివరించానని పేర్కొన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు పీసీసీ ఇస్తే పార్టీ నష్టపోతుందని వీహెచ్ పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీలోని సీనియర్​ నేతల అభిప్రాయాలు స్వీకరించాలని, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సోనియా గాంధీ ఇటీవల సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేయడం శుభపరిణామమని, రాహుల్​ గాంధీ కూడా సీనియర్ల అభిప్రాయాలను గౌరవిస్తానని ఒప్పుకోవడం స్వాగతిస్తున్నామని వీహెచ్​ పేర్కొన్నారు.


Next Story

Most Viewed