సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ బహిరంగ లేఖ

by  |
Revanth-reddy-and-kcr
X

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జరిగిన పంట నష్టంపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సోమవారం బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చాయని, కోట్ల రూపాయల పెట్టుబడులు నీటి పాలయ్యాయని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని, పంటంతా కోల్పోయి రైతులంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.

ఇలాంటి విపత్తు సమయాల్లో కేంద్ర బృందాలతో క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయించి పరిహారం అందేలా చూడాలి, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ ప్రక్రియ చేపట్టిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వ పంట బీమా పథకాలను సైతం ప్రభుత్వం అటకెక్కించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తే కేంద్రం ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15వేల చొప్పున పరిహారం చెల్లించాలని లేఖలో డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుతం 2018 ఎన్నికల మెనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రూ.లక్ష రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వడం లేదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుకోసం ఎత్తులు, హామీలు ఇవ్వడమే తప్ప రైతులకు రూ.వెయ్యి కోట్లు సాయం అందించాలన్న ధ్యాస సీఎం కేసీఆర్‌కు లేదని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed