టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల ముందు చావు డప్పు మోగిస్తాం : రేవంత్ రెడ్డి

by  |
Revanth-reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌పై తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని, నిజాం కాలంలో వొంగబెట్టి బండలు పెట్టి లాగుల్లో తొండలు విడిచేవాళ్లని, ఇప్పుడు కేసీఆర్‌కు కూడా అలాగే చేస్తామని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 9న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంతో దండు కడుతున్నామని, దండోరా వేస్తున్నామన్నారు. ఇందిరాభవన్‌లో కాంగ్రెస్​ఎస్టీసెల్​ఆధ్వర్యంలో పోడు భూముల పోరాటం పేరుతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి మాట్లాడుతూ… ఈ నెల 9న ఇంద్రవెల్లిలో దండు కడుతున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని తండాలు, గూడెలు తిరుగుతామని, దళిత బంధు కార్యక్రమంలో రూ.10 లక్షలు అందరికీ ఇవ్వాలని ప్రతి కాంగ్రెస్​కార్యకర్తా వినతిపత్రాలు ఇవ్వాలని, నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రూ.10 లక్షలు ఇస్తామా.. చస్తావా అంటూ నినదించాలని పిలుపునిచ్చారు.

‘దళిత బంధు’ పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకోసం ఏకగ్రీవ తీర్మానం చేయాలని, నిధులు లేకపోతే ప్రగతిభవన్, సచివాలయం భూములను అమ్మైనా దళితబంధు అమలు చేయాలని స్పష్టం చేశారు. దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష వైఖరి అవలంబిస్తుందని, సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ, పోడు భూములను లాక్కుంటున్నారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ దళిత, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని, దళిత బంధు కార్యక్రమం దళితులపై ప్రేమ ఉండి కాదని, కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే పథకం తెచ్చారన్నారు. కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేసిన నిధులు ఎన్నో శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్​రెడ్డి డిమాండ్ చేశారు.

దళిత, గిరిజన హక్కుల కోసం ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించబోతున్నామని వెల్లడించారు. దళిత బంధు అమలు చేయకపోతే టీఆర్ఎస్​ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యంలో దళిత, గిరిజనులకు భూములు ఇస్తే కేసీఆర్ సర్కార్ పోలీసులతో దాడులు చేసి ఆ భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. దళితులకు రూ.10 లక్షలు ఇస్తామంటే ఎవరూ అడ్డుకోరని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను పెడితే దళిత బంధుపై ఏకగ్రీవ తీర్మానం చేస్తామని, ప్రగతి భవన్‌ను అమ్మి ఇచ్చిన అభ్యతరం లేదని, అమ్మకానికి పెడితే తామూ మద్దతు ఇస్తామని, లేకుంటే కేసీఆర్ గడీలను పగలగొడతామని హెచ్చరించారు. మా భూములు మాకు కావాలి అంటూ తాడ్వాయి అడవుల్లో ఆడబిడ్డలను చెట్టకు కట్టేసి కొట్టిన చరిత్ర టీఆర్ఎస్​దేనన్నారు. అడవిని నమ్ముకుని బతుకుతున్న గిరిజనులను ప్రభుత్వం మోసం చేస్తుందని, ఈ ఏడేండ్లలో కేసీఆర్​ఎప్పుడైనా దళిత, గిరిజనుల నాయకులతో సమావేశాలు పెట్టారా అని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు.

ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు : భట్టి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు భూముల పంపిణీ జరుగుతుందని అందరూ ఆశించారని, కానీ, కేసీఆర్ భూములు ఇవ్వకపోగా.. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములను లాక్కుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎస్టీలకు పోడు భూములపై హక్కులు కల్పించి.. వారు తల ఎత్తుకు తిరిగేలా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్​దేనని, పోడు భూములపై హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, రేవంత్​రెడ్డితో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

దళిత సీఎం పేరుతో మోసం చేశారు : సీతక్క

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత మోసం చేశారని, నిధులు, పథకాల పేరుతో ఇంకా మోసం చేస్తూనే ఉన్నాడని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, హరితహారం పేరుతో భూములను గుంజుకుంటున్నారని, కాంగ్రెస్​పార్టీ పోడు భూములకు హక్కులు కల్పించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సబ్​ప్లాన్​ నిధులు ఖర్చు చేయడం లేదని, దళితులు, గిరిజనులకు ఇచ్చిన సంక్షేమ పథకాలను సబ్​ప్లాన్​కింద చూపిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు లేవని, చదవులు లేవని, రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్​పట్టించుకోలేదని, రైతుబంధు, దళిత బంధు అన్నీ ఎన్నికల హామీలేనని సీతక్క ఆరోపించారు. పోడు భూములను రక్షించుకుందామని, ఇంద్రవెల్లి వేదికగా జరుగుతున్న ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


Next Story

Most Viewed