ఈటల సంగతి సరే.. మరి గొంగిడి అరాచకాలేంది..?

by  |
ఈటల సంగతి సరే.. మరి గొంగిడి అరాచకాలేంది..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి అభివృద్ధిని ఆసరాగా చేసుకుని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఆమె భర్త డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులు దేవాలయ, అసైన్డ్, సీలింగ్, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలను తీసుకోవడం లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి, మీడియా కోఆర్డినేటర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి ప్రశ్నించారు. యాదాద్రిలో మహేందర్ రెడ్డి పేరు మీద ఉన్న మయూరి హోటల్ ప్రభుత్వ భూమిలో ఉందని, పాతగుట్ట పరిసరాల్లోని దాతరుపల్లిలో దేవాలయ భూములను సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత ఆక్రమించుకుని, వెంచర్లు చేసి మహేందర్ రెడ్డి విక్రయించారని పేర్కొన్నారు.

మాసాయిపేట, వంగపల్లి, యాదగిరిపల్లి గ్రామాల్లో వెలిసిన అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లలో స్వయంగా మహేందర్ రెడ్డి, ఆయన బినామీలు వందలాది ఎకరాల్లో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఇందుకుగాను మహేందర్ రెడ్డి పలు రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి విలువైన ప్లాట్లు పొందారని, బొమ్మల రామారం, రాజపేట మండలాల్లో అసైన్డ్ భూములను సునీత స్వయంగా ఆక్రమించుకున్నారని వివరించారు. గొంగిడి దంపతుల వియ్యంకుడితో కలిసి జీఓ 111 కింద ఉన్న గ్రామాల్లోని భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారని చెప్పారు. 2014లో ఎమ్మెల్యే అయ్యేదాక తెల్లరేషన్ కార్డు ఉన్న సునీత ఇప్పుడు వందల కోట్లు సంపాదించారని, ఇలాంటి చాలా అక్రమాలపై జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏకు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశానని అయోధ్యరెడ్డి చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం పట్టించుకోకుంటే గౌరవ హైకోర్టులో పిల్ వేశానని, తెల్ల రేషన్ కార్డు ద్వారా 2013 వైద్యం, ఇతర ప్రయోజనం పొంది, ఎమ్మెల్యే అయిన తర్వాత వందల కోట్లు, హోటళ్లు, భూములు, ప్లాట్లు, కొత్త కొత్త వాహనాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ జరుపలేదని, గొంగిడి దంపతుల భూ అక్రమాలకు, ఆస్తులకు సంభందించిన అన్ని ఆధారాలు ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ఇచ్చినా ఎందుకు శిక్షించలేదన్నారు. మంత్రి ఈటల రాజేందర్ మీదనే కాదు గొంగిడి దంపతుల మీద విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed