తెలంగాణలో ఊటి..‘అనంతగిరి’

by  |
తెలంగాణలో ఊటి..‘అనంతగిరి’
X

దిశ, పరిగి: ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి యాంత్రిక జీవనానికి అలవాటుపడ్డాడు. రోజులో ఎక్కువ సమయం ఆఫీసులోని ఎల్‌ఈ‌డీ లైట్ల మధ్యనే గడుపుతున్నాడు. 30 రోజులు పని చేసి ఒకటో తారీకు వచ్చే వేతనం కోసం ఎదుచూస్తున్నాడు. కుటుంబ బరువు బాధ్యతలు మోయడం, విధులు నిర్వర్తించడం ద్వారా చాలా మందిలో ఒత్తిడి పెరుగుతోంది. దీనిని తగ్గించుకునేందుకు విహారయాత్రలు అవసరం. పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం ద్వారా ఒత్తిడి తగ్గడమే కాకుండా మానసికోల్లాసం కలుగుతుంది. నూతనోత్తేజం వస్తుంది. మన దేశంలో పలు రాష్ట్రాల్లో విభిన్నమైన టూరిస్టు ప్లేసెస్ ఉన్నాయి. వీటి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. టూరిజంతో వచ్చే ఆదాయం ఆర్థిక వ్యవస్థను మందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. నేడు జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు ఇక్కడ తెలుసుకుందాం.

తెలంగాణలోని అతిపెద్ద దట్టడవి అనంతగిరి అడవి. ఇక్కడి ఎత్తైన కొండలు..వన్యప్రాణి సంపద చూపరులను ఆకట్టుకుంటాయి. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ఈ మనోహర ప్రదేశం హైదరాబాద్‌కి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని తెలంగాణ ఊటిగా పిలుస్తుంటారు. అనంతపద్మనాభ స్వామి ఆలయం..చుట్టూ అడవి..అడవి మధ్యలోంచి రైలు మార్గం..ధారూరు, కెరవెళ్లి, బుగ్గ ఆలయం, కోటపల్లి ప్రాజెక్టు జిల్లాలో ఉన్నాయి. పరిగి నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. పచ్చని పంట పొలాల మధ్యలో ఉండే విండ్ ఫవర్ ఫ్యాన్లు చూపరులను కనువిందు చేస్తాయి. పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం, లఖ్నాపూర్ ప్రాజెక్టు, సయ్యద్​పల్లి దర్గా, న్యామత్‌నగర్ దర్గా, పూడూరు మండలంలో దామగుండం, కుల్కచర్లలో పాంబండ రామలింగేశ్వర ఆలయం, ముజాహిద్‌పూర్​ గ్రామంలో నిజాం నవాబుల కట్టడాలు, అశ్వశాలలు, గుంబజ్లు చూడదగిన ప్రదేశాలు. నగరవాసులు వన్ డే ట్రిప్ వెళ్లి..ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. అనంతగిరి కొండల వద్ద జలపాతం చూడముచ్చటగా ఉంటుంది. ఈ అడవుల్లో అధికారులు రెండు ట్రెక్కింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు.


Next Story