టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మే సవాల్.. బీజేపీ వ్యూహాత్మక అడుగులు

by  |
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మే సవాల్.. బీజేపీ వ్యూహాత్మక అడుగులు
X

మొన్నటి వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల సందడి, తర్వాత మేయ‌ర్, ఉప‌మేయ‌ర్ ల ఎన్నిక‌లు.. కొంత చ‌ల్ల‌బ‌డిన రాజ‌కీయ వాతావ‌ర‌ణం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లతో మళ్లీ వేడెక్కింది. మ‌హబూబ్ న‌గ‌ర్ -రంగారెడ్డి – హైద‌రాబాద్ స్థానానికి అధికార పార్టీ అభ్య‌ర్థిగా మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కూతురు సుర‌భి వాణిదేవీ, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీడీపీ నుంచి ఎల్ ర‌మ‌ణ, వామపక్షాల అభ్యర్థిగా ప్రొ. నాగేశ్వర్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో విజయకేతనం ఎగరవేసిన బీజేపీ తిరిగి సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. స్వతంత్రులు కూడా సై అంటున్నారు.

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్/రంగారెడ్డి: మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో విజ‌యం సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్ర‌మిస్తోంది. ఆరేళ్ల క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఉద్యోగ సంఘ నేత జీ దేవీప్ర‌సాద‌రావు బీజేపీ అభ్య‌ర్థి, న్యాయ‌వాది రామ‌చందర్ రావు చేతిలో ఓట‌మి చ‌విచూశారు. దీంతో ఈ ప‌ర్యాయం టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల‌లోనూ బీజేపీకి మ‌రోమారు అవ‌కాశం ఇవ్వ‌రాద‌నే ఉద్ధేశంతో వ్యూహాత్మ‌కంగా మాజీ ప్ర‌ధాని పీవీ కుమార్తె సుర‌భి వాణిదేవీని బ‌రిలోకి దించింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఓట్ల‌ను చీల్చ‌డంతోపాటు పీవీ అభిమానుల ఓట్లు కూడా రాలుస్తుంద‌ని పార్టీ అంచ‌నా వేసిన‌ట్లుగా క‌న‌బ‌డుతోంది.

సీరియస్ గా తీసుకున్న మంత్రి కేటీఆర్…

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల బాధ్య‌త మీద వేసుకున్న మంత్రి కేటీఆర్ ఊహించిన విజ‌యానికి అడుగు దూరంలో నిలిచిపోయారు. దీంతో మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక చివ‌రి వ‌ర‌కు సంక్లిష్టంగా మారింది. అయితే ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో మాత్రం చిన్న పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాల‌నే విధంగా మంత్రి కేటీఆర్ పాములు క‌దుపుతున్నారు . ఇందులో భాగంగానే ఆయ‌న ఇటీవల తెలంగాణభవన్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా నేతలతో, ప్రగతిభవన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నేతలతో ఆయన విడివిడిగా సమావేశ‌మైవారికి దిశా నిర్దేశం చేశారు. పార్టీపై, ప్రభుత్వంపై కుట్రపూరితంగా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ బలంగా, ఆత్మవిశ్వాసంతో తిప్పికొట్టాలని ఆయ‌న ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో ఆత్మ‌న్యూనతాభావంతో ఉండకూడదని, హోం వర్క్‌ బాగా చేసి టీవీ చర్చల్లో పాల్గొనాలని సోషల్‌ మీడియాలో పార్టీ వాణిని బలంగా వినిపించాలని సూచించారు.

కీల‌కంగా మారనున్న ఉద్యోగుల ఓట్లు….

ఉద్యోగుల‌తో స్నేహ పూర్వ‌క ప్ర‌భుత్వమంటూ సీఎం కేసీఆర్ పాల‌న సాగిస్తున్నారు. అయితే దీర్ఘ‌ కాలంగా పెండింగ్ లో ఉన్న వారి స‌మ‌స్య‌లు దాట వేస్తూ వ‌స్తున్నారు. ముఖ్యంగా పీఆర్సీ, ఏపీకి కేటాయించిన ఉద్యోగులంద‌రినీ సొంత రాష్ట్రానికి తీసుకురావ‌డం, ఉద్యోగుల వ‌యో ప‌రిమితి పెంపు, పాత పెన్ష‌న్ విధానాన్ని అమ‌లులోకి తేవాల‌నేవి డిమాండ్ చేస్తున్నారు. ఇవి చాలా కాలంగా పెండింగ్ లో ఉండ‌డం, ఉపాధ్యాయుల ప‌ట్ల ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో వారు గుర్రుగా ఉన్నారు. ఇవే కాకుండా నిరుద్యోగ యువ‌త కూడా ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంచ‌రాద‌ని డిమాండ్ చేస్తుండ‌గా పెంచాల‌ని ఉద్యోగులు కోరుతున్నారు. వ‌యో ప‌రిమితి పెంచితే పార్టీ ప‌రిస్థితి ‘విడ‌వ‌మంటే పాముకు కోపం – క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం’ అనేలా టీఆర్ఎస్ పార్టీ ప‌రిస్థితి త‌యారైంద‌ని టీఆర్ఎస్ లీడర్ల లోనే చర్చ జరుగుతోంది. అంతేకా కుండా ఉద్యమ టైమ్ లో ఉన్న పరిస్థితులకు ఇ ప్పటికీ చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఆ వెంటనే జరిగిన కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీ ఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. 2015 లోనూ జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి అతి కష్టం మీద బయటపడ్డారు. హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి పోటీచేసిన దేవిప్రసాద్ ఓడిపోయారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ టీఆర్ఎస్ లీడర్లే చెబుతున్నారు. ఆ వ్యతిరేకతను తట్టుకొని గెలవటం సాధ్యం కాదని ఓపెన్ గానే మాట్లాడుకోవ‌డం గ‌మ‌నార్హం.

సాధారణానికి దీటుగా ఎన్నికల ప్రచారం..

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గతంలో ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగులను, ఎక్కువ పట్టభద్రులు ఉన్న సంస్థలకు వెళ్లి ఓటు అభ్యర్థించేవారు. ప్రస్తుతం మాత్రం ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తుంది. ప్రచార వాహనాలను కూడా వాడేస్తున్నారు. సభలు,సమవేశాలు జోరుగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తూ సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికల సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థి ప్రతి మండలం తిరిగే పరిస్థితి లేదు. అభ్యర్థి గెలుపు బాధ్యతను నాయకులు, కార్యకర్తలు మీదేసుకుంటున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు ఏ ర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మంత్రలు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.


Next Story

Most Viewed