ఇందూరులో టోటల్ లాక్ డౌన్

by  |
ఇందూరులో టోటల్ లాక్ డౌన్
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ (కొవిడ్ -19) మహమ్మారి కట్టడికి అధికారులు టోటల్ లాక్ డౌన్ విధించారు. జిల్లాలో 15 కంటైన్‌మెంట్ క్లస్టర్‌ల పరిధిలో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలవుతోంది. ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్లస్టర్ల పరిధిలో అధికారులు ఇంటింటి సర్వే చేస్తూ ప్రతి ఒక్కరి రక్తనమూనాలు సేకరిస్తున్నారు. కొవిడ్ 19 పాజిటివ్ కేసుల నమోదు పెరగడంతో అధికార యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, మార్కెటింగ్ శాఖల సంయుక్త కార్యచరణతో లాక్ డౌన్ అమలు అవుతున్నది. నిజామాబాద్ జిల్లా కొవిడ్-19 పాజిటివ్ కేసుల్లో రాష్ర్టంలో రెండోస్థానంలో ఉన్నది.

గడిచిన వారం రోజుల వ్యవధిలోనే నిజామాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. మొదట్లోనే మహమ్మారి కట్టడికి అధికార యంత్రాంగం హాట్‌స్పాట్‌గా గుర్తించింది. పాజిటివ్, క్వారంటైన్ కేసుల‌ను బట్టి కంటైన్‌మెంట్ క్లస్టర్ జోన్‌లుగా గుర్తించారు. వైద్య, ఆరోగ్య శాఖ సర్వేలతో పాటు శాంపిళ్ల సేకరణ చేపట్టింది. మున్సిపల్ అధికారులు అయా ప్రాంతాల్లో పారిశుధ్య పనులతో పాటు, ఫాగింగ్, రసాయనాల పిచికారీ నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖ ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని వాటిలో రాకపోకలను నియంత్రించారు.

కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రెండో విడతలో 16 రాగా మూడో విడతలో 10, నాల్గో విడతలో 10 కేసులు నమోదు కాగా అధికార యంత్రాంగం మొత్తం లాక్ డౌన్‌కు నిర్ణయించింది. 109 మంది నుంచి సేకరించిన శాంపిళ్ల రిపోర్టులు రావాల్సి ఉండగానే అప్రమత్తమైంది. ఇప్పటికే హట్ స్పాట్‌గా ఉన్న నిజామాబాద్ సిటీని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఇతర ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు పెరగడంతో కంటైన్‌మెంట్ క్లస్టర్‌లలో కలిపి అక్కడ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ టోటల్‌గా అమలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాలలో కిలోమీటర్ వరకు బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రధాన రహదారులను మూసేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా బయట వ్యక్తులు లోనికి రాకుండా నిలువరించే పనులు రాత్రి‌కి రాత్రే షురూ అయ్యాయి.

సిటీ నుంచి గ్రామాలకు..

కొవిడ్-19 పాజిటివ్ కేసులు తొలుత నిజామాబాద్ సిటీలో ప్రారంభమై పరీక్షలలో వచ్చిన రిపోర్టుల ప్రకారం గ్రామాలకూ పాకింది. నిజామాబాద్‌లో 39 కేసులు కాగా అందులో 22 కేసులు నిజామాబాద్ సిటీలో నమోదైనవి. తర్వాత మోస్రా 4, మాక్లూర్ 2, నందిపేట్ 1, భీంగల్ 1, బాల్కొండ 2, బోధన్ 5, ఆర్మూర్ 1, రెంజల్ 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మర్కజ్‌ సభలో పాల్గొన్నవారు 60 మంది గుర్తించగా వారి ద్వారానే కొవిడ్ 19 ఇతరులకు అంటుకుందని అధికారులు అంచనా వేసి ప్రాథమిక కేటగిరిలో ఉన్న వారి కుటుంబ సభ్యులను, రెండో కేటగిరిలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను
క్వారంటైన్‌లో ఉంచి వారికీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 3,800 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. నిజామాబాద్ సిటీలోని బర్కత్‌పుర, హబీబ్‌నగర్, ఆటో‌నగర్, ఖిల్లా ప్రాంతంలో మాత్రమే కాకుండా మైనార్టీ ఏరియాలోనూ టోటల్ బంద్‌కు అధికారులు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేశారు.

కంటైన్‌మెంట్ క్లస్టర్‌కు ఒక కార్యాలయం

కంటైన్‌మెంట్ క్లస్టర్ జోన్‌లలో 15 రోజుల పాట్ లాక్ డౌన్ ఉన్న ఏరియాలో ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు. కార్యాలయంలో ఒక డాక్టర్‌తో పాటు సిబ్బంది‌ని ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ తరఫున క్లస్టర్ బాధ్యతలను స్థానిక పీఎస్ ఎస్‌ఐలను నియమించారు. సంచార వాహనాల ద్వారా కురగాయలు, పాలు అందించే ఏర్పాటు చేయగా, మొబైల్ మార్కెట్లతో నిత్యావసరాలను అందించనున్నారు. మంగళవారం కేవలం 21 శాంపిళ్ల పరీక్షలలో 10 కొవిడ్ 19 పాజిటివ్ కేసులు రాగా మిగిలిని 109శాంపిళ్ల రిపోర్టులు వస్తే కేసుల సంఖ్య పెరిగిన వారందరికి సంబంధించిన వారిని క్వారంటైన్ ఆస్పత్రులకు తరలించే ఏర్పాట్లు అధికారులు చేశారు.

పకడ్బందీ అమలుకు పర్యవేక్షణ..

మంగళవారం నమోదైన 10 కొవిడ్-19 పాజిటివ్ కేసులకు సంబంధించిన కుటుంబీకులు, వారిని కలిసిన సన్నిహితులను ఆస్పత్రికి తరలించారు. 100 మంది ఆశాలకు ఒక ఏఎన్‌ఎం, 4 ఏఏన్ఎంలపై హెల్త్ సూపర్ వైజర్లను ఒక డాక్టర్‌ను నియమించారు. 108 అంబులెన్సులను అత్యవసరానికి సిద్ధం చేశారు. ‌కంటైన్‌మెంట్ క్లస్టర్ల పరిధిలో లాక్ డౌన్ టోటల్ బంద్ పకడ్బందీగా అమలుకు నోడల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ రెండు వారాలు పొడిగించాలని కోరకముందే నిజామాబాద్‌లో కంటైన్‌మెంట్ క్లస్టర్ జోన్ల పరిధిలో ఏప్రిల్ 20 వరకు టోటల్ లాక్‌డౌన్ అమలు చేయనున్నారు.

Tags: total lockdown, due to covid 19, cases increasing, corona virus effect

Next Story