దేశంలో కరోనా @ 46711

by  |
దేశంలో కరోనా @ 46711
X

తొలి 10 వేలకు 16 రోజులు
30 నుంచి 40 వేలకు 4 డేస్

దిశ, న్యూస్‌బ్యూరో : సడలింపులు షాక్ ఇస్తున్నాయి. కరోనా కొత్త కేసులు స్పీడు పెంచుతున్నాయి. కరోనా దేశంలో ప్రవేశించినప్పటి నుంచి ప్రతి పదివేల కేసుల నమోదుకు వ్యవధి తగ్గుతూ వస్తోంది. దేశంలో తొలి పది వేల కేసులకు 16 రోజులు పడితే, తాజాగా ముప్పై వేల నుంచి నలభై వేల కేసులకు కేవలం 4 రోజుల్లోనే చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అంతకముందు ఇరవై వేల నుంచి ముప్పై వేలకు 7 రోజులు, పది వేల నుంచి ఇరవై వేలకు 8 రోజులు పట్టింది. నెల రోజుల క్రితం ఏప్రిల్ 5కు దేశంలో మొత్తం కేసులే 3374గా ఉండగా.. సరిగ్గా నెల తర్వాత మే 5 మంగళవారం ఒక్క రోజులోనే 3875 కేసులు రికార్డవడం దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో నమోదైన కొత్త కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 46711కు చేరింది. అంతేకాకుండా, మంగళవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 194 మరణాలు నమోదు కాగా, దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1583కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1399 మంది డిశ్చార్జ్ అవగా.. మొత్తంగా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 13161కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజే 67 పాజిటివ్ కేసులు నమోదవగా, మంగళవారానికి మొత్తం కేసులు 1717కు చేరుకున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 589 మంది కరోనా నుంచి కోలుకోగా 34 మంది వ్యాధితో చనిపోయారు.

ముంబై, చెన్నైలో కరోనా కరాళ నృత్యం..

ముంబై, చెన్నై నగరాల్లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ ఈ నగరాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముంబైలో 508, చెన్నైలో 269 కొత్త పాజిటివ్ కేసులు మంగళవారం ఒక్కరోజే నమోదవడం ఈ నగరాల్లో కరోనా వ్యాప్తి తీవ్రతను తెలుపుతోంది. ముంబైలో కొత్తగా నమోదైన 635 కేసులతో కలిపి మొత్తం మహారాష్ట్రలో ఒక్కరోజే 984 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15525కు చేరింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 2819 మంది డిశ్చార్జవగా ఈ ఒక్క రోజే 354 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇక్కడ కరోనా వల్ల మంగళవారం ఒక్కరోజే 34 మంది మరణించగా ఇప్పటివరకు 617 మంది చనిపోయారు. కాగా, ముంబై నగరంలో మొత్తం కేసుల సంఖ్య 9945కు చేరింది. ఇప్పటివరకు ఒక్క ముంబై నగరంలోనే 387 మంది కరోనాతో చనిపోగా మంగళవారం 26 మంది ప్రాణాలొదిలారు. ఇక తమిళనాడులో ఒక్కరోజే 508 కొత్త పాజిటివ్ కేసులు రికార్డై రాష్ట్రంలో మొత్తం కేసులు 4058కి చేరుకోగా వీటిలో 269 కొత్త కేసులు రాజధాని చెన్నైలోనే నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2008కి చేరింది. చెన్నైలో ఇప్పటివరకు ఈ వ్యాధి బారినపడి 20 మంది ప్రాణాలు కోల్పోగా.. తమిళనాడు వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో మంగళవారమే 2 మరణాలు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 206 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 5104కు చేరింది. ఇక్కడ ఇప్పటివరకు 1468 మంది వ్యాధి నుంచి కోలుకోగా 64 మంది మరణించారు.

Tags: corona, india, tuesday, cases, corona positive cases

Next Story

Most Viewed