రేపు కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

by  |
రేపు కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం రాత్రి ఏడు గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది. మరుసటి రోజు (గురువారం) అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది. అన్నిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు విధిగా రాష్ట్ర రాజధానిలో ఉండాలని అన్నిశాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. బడ్జెట్ సమర్పించేందుకు ముందు కేబినెట్ సమావేశం జరగడం ఆనవాయితీ. బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం లభించడం కూడా తప్పనిసరి. ఈ నేపథ్యంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో బడ్జెట్ అంశం మాత్రమే చర్చిస్తారా? లేక ఇతర అంశాలేమైనా చర్చకొస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈసారి బడ్జెట్ డిజిటల్ రూపంలో ఉండే అవకాశం ఉంది. సభ్యులందరికీ పెన్ డ్రైవ్ రూపంలోనే ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీ వర్గాల సమాచారం. బడ్జెట్ మాత్రమే కాకుండా వివిధ శాఖలకు సంబంధించిన పద్దులు, ప్రభుత్వరంగ సంస్థల వార్షిక నివేదికలు, కాగ్ రిపోర్టు సైతం డిజిటల్ రూపంలో ఉంటుందని సమాచారం.

రేపే ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

కరోనా కేసులు కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కట్టడి, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ఇకపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అవలంభించాల్సిన విధానం తదితర పలు అంశాలపై ప్రధాని మోడీ అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు చేయనున్నారు. ఇదే సమయంలో వివిధ సెక్షన్ల ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ కావడానికి సంబంధించి కొన్ని రాష్ట్రాలు ఈ సమావేశంలో నిర్దిష్ట సూచనలు, విజ్ఞప్తులు, ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిసింది.


Next Story

Most Viewed