Tokyo Olympics Games 2021 : క్రీడలు ప్రమాదమంటున్నారు.. ఒలింపిక్స్ నిర్వహణపై వెనుకడుగు?

by  |
Tokyo Olympics Games 2021 : క్రీడలు ప్రమాదమంటున్నారు.. ఒలింపిక్స్ నిర్వహణపై వెనుకడుగు?
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ మెగా క్రీడలు టోక్యో ఒలింపిక్స్‌కు మరో 7 వారాల సమయమే మిగిలి ఉన్నది. ఇప్పటికే జపాన్ ప్రభుత్వం, టోక్యో ఒలింపిక్ నిర్వహణ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. ఒలింపిక్ విలేజ్‌ను పూర్తి స్థాయిలో శానిటేషన్ చేసినట్లు ఒలింపిక్ నిర్వహణ కమిటీ వెల్లడించింది. మరోవైపు కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో ఒలింపిక్స్ నిర్వహించడం చాలా ప్రమాదకరమని హెచ్చరికలు వెలువడుతున్నాయి. జపాన్‌లోని ప్రముఖ దినపత్రిక ది ఆషి షింబన్ టోక్యో ఒలింపిక్స్‌కు ప్రధాన స్పాన్సర్‌గా కూడా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలో ఆ పత్రిక తమ ఎడిటోరియల్‌లో టోక్యో ఒలింపిక్స్‌ను ఉద్దేశిస్తూ ఒక ఆర్టికల్ ప్రచురించింది. తాము మే 15, 16 తేదీల్లో నిర్వహించిన ఒక సర్వేలో 83 శాతం మంది జపాన్ వాసులు ఒలింపిక్స్ నిర్వహణకు వ్యతిరేకంగా ఉన్నట్లు పేర్కొన్నది. 43 శాతం మంది ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని ఖరాఖండీగా చెప్పినట్లు ది ఆషి షింబన్ పత్రిక తెలిపింది. ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వేలో ఒలింపిక్స్ నిర్వహణకు ప్రతికూలంగా ఉన్న వారి సంఖ్య 10 శాతం పెరిగినట్లు సదరు పత్రిక పేర్కొన్నది. తాము కూడా ఒలింపిక్స్ స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలిగే ఆలోచన చేస్తున్నట్లు పత్రిక యాజమాన్యం కూడా వ్యాఖ్యానించింది.

Will Tokyo's Olympics win gold for sustainability? | Financial Times

జపాన్‌లో ఆరోగ్య సంక్షోభం..

టోక్యో ఒలింపిక్స్ నిర్వహిస్తే జపాన్‌లో ఆరోగ్య సంక్షోభం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆ దేశ వైద్యుల సంఘం స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాల నుంచి 1 లక్ష మంది అథ్లెట్లు, కోచ్‌లు, మ్యాచ్ అఫిషియల్స్, జర్నలిస్టులు, వాలంటీర్లు టోక్యోకి రానున్నారు. జపాన్ ప్రభుత్వం కనుక మొండిగా ముందుకే వెళితే తప్పకుండా ‘ఒలింపిక్ స్ట్రెయిన్’ పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు జపాన్ వైద్యుల సంఘం అధ్యక్షుడు నావోటో యుయేమా హెచ్చరించారు. అనేక దేశాల నుంచి వచ్చే వైరస్‌లు కలిసిపోయి మానవాళికి అత్యంత ప్రమాదకరమైన స్ట్రెయిన్ పుట్టుకొస్తుందని ఆయన అంటున్నారు. ప్రస్తుతం జపాన్‌లో 5 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. టోక్యో సహా పలు నగరాల్లో ఎమర్జెన్సీని కూడా విధించారు. జుల్ 23 నాటికి 90 శాతం మంది క్రీడాకారులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశం ఉన్నది. కానీ ప్రజలకు మాత్రం పూర్తి స్థాయిలో టీకా అందుబాటులోకి రాదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే కరోనా పలు దేశాల్లో మార్పులు చెంది కొత్త స్ట్రెయిన్స్ పుట్టుకొని వచ్చాయి. ఆ స్ట్రెయిన్స్ అన్నీ టోక్యోలో కలిస్తే అత్యంత భయంకరమైన వైరస్ పుట్టుకొని వచ్చి జపాన్ ప్రజల ఆరోగ్యంపై పడే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఇది తప్పకుండా జపాన్‌లో ఆరోగ్య సంక్షోభానికి దారి తీస్తుందని ఆయన అంటున్నారు.

Tokyo 2020 - Organising Committee

100 ఏళ్ల పాటు బాధపడాలి..

కరోనా వైరస్‌ను 2019లో గుర్తించిన దగ్గర నుంచి ఇప్పటికి ఏడాదిన్నర గడిచింది. ఇప్పుడు కొవిడ్ పలు దేశాల్లో కొత్త స్ట్రెయిన్ రూపంలో భయంకరంగా వ్యాపించింది. ఏడాదిన్నర కాలంలో కొవిడ్ బారి నుంచి బయట పడక పోగా మరిన్ని భయాలతో ప్రజలు గడుపుతున్నారు. ఇప్పటికీ పలు దేశాల్లో పూర్తి స్థాయిలో క్రీడలు నిర్వహించడం లేదు. టోక్యోలో పుట్టే కొత్త స్ట్రెయిన్ మరింత బలంగా ఉండే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కరోనాపై 70 నుంచి 80 శాతం మాత్రమే పోరాడగలుగుతున్నది. ఇండియన్ వేరియంట్ స్ట్రెయిన్‌ను ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌ను మరింత సమర్థవంతంగా పని చేయించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు ఒలింపిక్స్ స్ట్రెయిన్ కనుక వస్తే వ్యాక్సిన్లు పని చేస్తాయో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. పంతానికి పోయి ఒలింపిక్స్ నిర్వహిస్తే జపాన్ తప్పకుండా వందేళ్ల పాటు విమర్శలకు గురి కావల్సి ఉంటుంది. కాబట్టి ఈ మెగా క్రీడలను రద్దు చేయాలని జపాన్ వైద్యులు, ప్రజలు బలంగా కోరుతున్నారు. మరోవైపు ఐవోసీ మాత్రం ఒలింపిక్స్‌పై ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. క్రీడాకారులందరికీ ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తర్వాతే టోక్యోలో అడుగుపెట్టడానికి అనుమతి ఇస్తామని నిర్వాహక కమిటీ చెబుతున్నది. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తూ క్రీడలను విజయవంతం చేస్తామని చెబుతున్నది.


Next Story

Most Viewed