చరిత్రలో నిలిచిపోనున్న నేటి భద్రాద్రి సీతారాముల కల్యాణం

by  |
చరిత్రలో నిలిచిపోనున్న నేటి భద్రాద్రి సీతారాముల కల్యాణం
X

నేడు శ్రీరామనవమి పర్వదినం. ఈరోజు కోసం భక్తులంతా ఎదురుచూశారు. సీతారాముల కల్యాణాన్ని కనులారా చూసి తనివితీరాలన్న సమస్త భక్తకోటి ఆశలు అడియాశలయ్యాయి. తెలంగాణలోని ప్రసిద్ధ భద్రాచలం రాములోరి ఆయలంలో కేవలం ఆలయ అధికారులు, అర్చకులు తదితర అతికొద్ది సిబ్బందితో ఈ వేడుక జరుగనుంది. దీనిని అందరూ మన్నించి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చూడాలని ప్రభుత్వం కోరిన విషయం తెలిసింది. అయితే ఒక్క భద్రాద్రి ఆలయంలోనే కాకుండా దేశంలోని అన్ని దేవాలయాల్లో నేటి సీతారాముల కల్యాణం ఇలాగే జరుగనుంది. ప్రతి ఏడాది భద్రాద్రి సీతారాముల కల్యాణం అంగరంగ వైభోగంగా మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభిత మండపంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. కానీ కరోనా వైరస్‌ ప్రభావంతో దేవస్థానం చరిత్రలో తొలిసారి ఈసారి రామయ్య కల్యాణాన్ని ఆలయంలోని నిత్య కల్యాణ మండపం వద్ద నిర్వహించనున్నారు. రామాలయం నిర్మాణం చేపట్టిన మూడున్నర శతాబ్దాలలో భక్తుల భాగస్వామ్యం లేకుండా ఏనాడు ఈ విధంగా కల్యాణం జరగలేదని, నేటి ఈ కల్యాణం చరిత్రలో నిలిచిపోనుందని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు. రామయ్య కల్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని పురస్కరించుకొని దేవస్థానం అధికారులు సుమారు రూ.3 లక్షలతో కల్యాణ మండపాన్ని పుష్పాలతో అలంకరిస్తున్నారు. ఇతర ఏర్పాట్లకు మారో రూ.2లక్షల వరకు వెచ్చిస్తున్నారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమర్పించనున్నారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు కేవీ రమణాచారి ఉన్నారు. రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు కేవీ రమణాచారి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ చైర్మన్‌ కోరం కనయ్య కూడా కల్యాణాన్ని తిలకించేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. నవమి ఏర్పాట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ఎంవి రెడ్డి, ఎస్పీ సునీల్‌దత్‌, ఏఎస్‌పీ రాజేష్‌చంద్ర, దేవస్థానం ఈవో జి.నర్సింహులు పర్యవేక్షిస్తున్నారు.

Tags: bhadradri, srirama navami, celebration, wedding, ministers indra karan reddy

Next Story

Most Viewed